Play grounds: చెరువులు కాదు.. మైదానాలే!
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:39 PM
Flooded Fields Heavy Rainfall జిల్లాకేంద్రంలో క్రీడాకారులు అరకొర సౌకర్యాలతో సతమతమవుతున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

అరకొర సౌకర్యాలతో క్రీడాకారుల ఇక్కట్లు
రాత్రుల్లో మందుబాబుల విన్యాసాలు
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో క్రీడాకారులు అరకొర సౌకర్యాలతో సతమతమవుతున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఆడుకునేందుకు మైదానాలు కూడా సక్రమంగా లేవని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చిన్న వర్షం కురిస్తే చాలు.. ఈ క్రీడామైదానం చెరువును తలపిస్తోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో దోమలకు ఆవాసంగా మారుతోంది. శ్రీకాకుళంలో క్రీడాకారులకు మరో పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోడిరామ్మూర్తి స్టేడియానికి రక్షణ గోడ లేకపోవడంతో మందుబాబులు రాత్రివేళల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానానికి రక్షణ గోడ ఉన్నా.. మందుబాబులు రాత్రివేళలో హల్చల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ మందుసీసాలు పడేయడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో గాజు పెంకులు గుచ్చుకుని గాయాల పాలవుతున్నారు. క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని, రక్షణ గోడలు నిర్మించాలని, సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.