పరిహారం ఇవ్వనిదే ఖాళీ చేయం
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:48 PM
తాము పోర్టుకి వ్యతిరేకం కాదని, అందరికన్నా ముందుగా భూములివ్వడానికి ముందుకు వచ్చామని మూలపేట గ్రామస్థులు స్పష్టంచేశారు.
సంతబొమ్మాళి, జూలై17 (ఆంధ్రజ్యోతి): తాము పోర్టుకి వ్యతిరేకం కాదని, అందరికన్నా ముందుగా భూములివ్వడానికి ముందుకు వచ్చామని మూలపేట గ్రామస్థులు స్పష్టంచేశారు. భూములివ్వని వారికి అధిక మొత్తం చెల్లించి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. తమకు కూడా అంత మొత్తంలో భూములకు పరిహారం ఇవ్వనిదే గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చిచెప్పారు. గురువారం మూలపేటలో పోర్టు నిర్వాసితుల సమస్యలను ఇంటింటికి వెళ్లి రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణంలో భాగంగా మూలపేట గ్రామాన్ని అక్కడ నుంచి నౌపడకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. అయితే తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకూ గ్రామం కదిలి వెళ్లే ప్రసక్తే లేదని గ్రామస్థులు తేల్చిచెప్పిన విషయం విదితమే. దీంతో ఇటీవల టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి గ్రామంలో సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమయంలో పెద్దఎత్తున గ్రామస్థులు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇంటింటికి వచ్చి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారని ఆర్డీవో హోమీఇచ్చారు.ఈ నేపధ్యంలో అధికారులు మూలపేటలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందరావు అధికారులు పాల్గొన్నారు.
లోపాలను బీఎల్వోలు సరిదిద్దాలి: ఆర్డీవో
టెక్కలి, జూలై 17(ఆంధ్రజ్యోతి): బీఎల్వోలు క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం టెక్కలి సబ్కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పోలింగ్ బూతులకు సంబంధించి ఓటర్ల అంశాలపై బీఎల్వోలకు అవగాహన కల్పించారు. కుటుంబసభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాలని, కొత్త ఓటర్ల చేర్పులు, చనిపోయిన ఓట్లు తొలగింపులు, డబుల్ ఎంట్రీలు తొలగింపుపై వివరించారు. సమావేశంలో ఎలక్షన్ డీటీ వనిత పాల్గొన్నారు.