Neet exam: ప్రశాంతంగా నీట్
ABN , Publish Date - May 04 , 2025 | 11:42 PM
Medical entrance వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది.
- నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
- 41 మంది అభ్యర్థులు గైర్హాజరు
ఎచ్చెర్ల/ శ్రీకాకుళం క్రైం/ గుజరాతీపేట, మే 4(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు 1,568 మందికిగాను 1,527 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 41 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్(ఎస్.ఎం.పురం)లో 720 మందికి 702 మంది, పభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(శ్రీకాకుళం)లో 240 మందికి 233మంది, కేంద్రీయ విద్యాలయం(పెద్దపాడు)లో 128 మందికి 123 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(శ్రీకాకుళం)లో 480 మందికి 469 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగ్గా.. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల మధ్య అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలకా్ట్రనిక్ వస్తువులు, ఫోన్లు, వాచ్లు, వాలెట్స్ వంటి ఇతర వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా ఉండేలా అభ్యర్థులను క్షుణ్నంగా పరిశీలించి లోపలికి విడిచిపెట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్, జామర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు. పటిష్ఠ భద్రత నడుమ నీట్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.