ఆధునికీ‘కరుణ’ లేకపోయె
ABN , Publish Date - May 20 , 2025 | 12:21 AM
ఖరీఫ్ సమీపిస్తోంది.. కొద్దిరోజుల్లో రైతులు పొలంబాట పట్టనున్నారు. ఇప్పటికే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఇటు సాగునీటి పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
ఖరీఫ్ సమీపిస్తోంది.. కొద్దిరోజుల్లో రైతులు పొలంబాట పట్టనున్నారు. ఇప్పటికే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఇటు సాగునీటి పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రాజెక్టులు, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడమే ఇందుకు కారణం. కనీసం తాత్కాలిక పనులకూ మోక్షం లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఎంఎఫ్ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టడం లేదు. దీనిపై రైతులు తీవ్ర నిరాశ పడుతున్నారు.
జియ్యమ్మవలస, మే 19 (ఆంధ్రజ్యోతి)
వచ్చే ఖరీఫ్లో సాగునీటికి రైతులకు తిప్పలు తప్పేటట్టు లేవు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) నిధులు మంజూరైనా వైసీపీ సర్కారు పుణ్యమా అని ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. అప్పటి నుంచి నిరాశతో ఉన్న రైతులు ఈ ఏడాది పూర్తిస్థాయిలో సాగు నీరు అందుతుందో, లేదోనని దిగులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జైకా నిధులు మంజూరైనా ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు అతీగతీ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరు వాత పనులు మంజూరైనా నీటి పారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో జరగడం లేదు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పనులు చేస్తారన్న నమ్మకమూ రైతుల్లో సడలుతోంది.
అటకెక్కిన ఆధునికీకరణ..
జిల్లాలో మీడియం ఇరిగేషన్కు సంబంధించి ఒట్టిగెడ్డ, వెంగళరాయ సాగర్, పెద్దగెడ్డ, పెదంకలాం ప్రాజె క్టుల ఆధునికీకరణకు టీడీపీ ప్రభుత్వ హయాం చివరి దశ అంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జైకా నిధులు రూ.153.33 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో 59,997 ఎకరాలు, విజయ నగరం జిల్లాలో 1,636.47 ఎకరాలు కలిపి మొత్తం 61,633.47 ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేయాల్సి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాం ఐదేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా చేపట్టలేదు. పనులు జరిగి ఉంటే ఒట్టిగెడ్డ రిజర్వాయర్ ద్వారా జియ్యమ్మవలస మండలంలో 16,680 ఎకరాలు, వెంగళరాయసాగర్ ద్వారా మక్కువ మండలంలో 14,550 ఎకరా లు, బొబ్బిలి మండలంలో 6,427.27 ఎకరాలు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలు కలిపి ఈ ప్రాజెక్టు ద్వారా 24,700 ఎకరాలకు సాగునీరందే ది. అలాగే పెద్దగెడ్డ ద్వారా మూడు మండలాల పరిధిలో 12 వేల ఎకరాలకు... పెదంకలాం ప్రాజెక్టు ద్వారా 8,253.47 ఎకరాలకు సాగునీరందేది. ఆధునికీకరణ పూర్తిగా అటకెక్కిపోయింది. ఇప్పుడు ఆ జైకా నిధుల పరిస్థితి ఏమిటో ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి, నీటి పారుదలశాఖకే తెలియాలి.
ఎస్డీఎంఎఫ్ పనులూ అంతే..
ప్రాజెక్టుల్లో కాలువల లైనింగ్ పనులు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (ఎస్డీఎంఎఫ్) నిధులు జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు మంజూరు చేస్తూ హైప్రయారిటీ వర్క్స్ చేయాలని నిర్ణీత గడువు కూడా విధించింది. ఈ ఎస్డీఎంఎఫ్ నిధుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో ఐదు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకూ ఈ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగునీటి కాలువల్లో ఎక్కడ అత్యవసరం అనుకుంటే అక్కడ ఈ నిధులతో పనులు చేయాల్సి ఉంది.
- తోటపల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో కురుపాం నియోజకవర్గం పరిధిలో రెండు, పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో మూడు, విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో మూడు వర్కులు కలిపి 8 వర్కులకు గాను రూ.293.02 లక్షల అంచనా విలువతో నిధులు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ కుడి కాలువ పరిధిలో చేయాల్సినవే. వీటిలో రెండు వర్కులు సెప్టెంబరు వరకు గడువు ఉంటే, మిగిలిన ఆరు జూలై నెలకు పూర్తి కావాల్సి ఉంది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని రెండు పనులు 30 శాతం పూర్తయ్యాయి. మిగిలిన ఆరు వర్కులు ఇంకా ప్రారంభమే కాలేదు.
- కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒట్టిగెడ్డ రిజర్వాయర్కు సంబంధించి మూడు పనులు రూ. 12 లక్షలతో మంజూరయ్యాయి. వీటిని మార్చి 2025 చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా ప్రారంభమే కాలేదు.
- పాలకొండ నియోజకవర్గం పరిధిలో రూ.30.80 లక్షలతో 8 పనులు మంజూరయ్యాయి. ఇవి కూడా మార్చి 2025 నెలాఖరుకు పూర్తికావాలి. ఇంకా ప్రారంభమే కాలేదు.
- వెంగళరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో రూ.73.9 లక్షలతో 19 పనులు మంజూరయ్యాయి. వీటిని ఏప్రిల్ 16కు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా ప్రారంభం కాలేదు.
- పెద్దగెడ్డ ప్రాజెక్టు పరిధిలో రూ.91 లక్షలతో 15 పనులు మంజూరయ్యాయి. వీటిని కూడా మార్చి నెలాఖరుకే పూర్తి చేయాలి. పనులు జరిగే పరిస్థితి లేదు.
- పెదంకలాం ప్రాజెక్టు పరిధిలో రూ.16 లక్షలతో 9 పనులు మంజూరయ్యాయి. వీటిని మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలి. వీటిలో కొన్ని నత్తనడకన సాగుతున్నాయి.
ఫ ఇక అంతర్ రాష్ట్ర వివాదంతో నలుగుతున్న కొమరాడ మండలంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు పరిధిలో ఎస్డీఎంఎఫ్తో చంద్రంపేట వద్ద యూటీ మరమ్మతులకు రూ.3.36 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఒక్క పని మాత్రమే మరికొద్ది రోజుల్లో పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎర్త్వర్క్ పూర్తి చేయించిన ఇంజనీరింగ్ అధికారి మరికొద్ది రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
ఎందుకీ నిర్లక్ష్యం..
ఎస్డీఎంఎఫ్ నిధులతో ప్రాజెక్టుల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన పనులను గత ఏడాదే ప్రభుత్వం మంజూరు చేసింది. పనుల పూర్తికి నిర్దిష్ట గడువు కూడా విధించింది. టెండర్ పాడుకున్న కాంట్రాక్టర్లతో పనులు చేయించడంలో నీటి పారుదలశాఖ అధికారులు తాత్సారం చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునికీకరణ పరిస్థితి దేవుడెరుక కనీసం ఈ పనులైనా చేస్తే ఖరీఫ్కు కొంతమేర సాగునీరందడంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని వీరు ఆశ పడుతున్నారు.