upadhi : కూలి పోతున్నారు!
ABN , Publish Date - May 09 , 2025 | 11:44 PM
Labourers Heatwave impact వేసవివేళ.. కనీస సౌకర్యాలు లేక ఉపాధిహామీ వేతనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత 40 డిగ్రీలకుపైగా పెరగడంతో కొంతమంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం ఒక్కరోజే జిల్లాలో ఇద్దరు మృతి చెందడంతో వేతనదారులంతా ఆందోళన చెందుతున్నారు.

40 డిగ్రీలకుపైగా పెరిగిన ఉష్ణోగ్రతలు
మృతి చెందుతున్న ‘ఉపాధి’ వేతనదారులు
కనీస సౌకర్యలు లేక ఇబ్బందులు
మెళియాపుట్టి, మే 9(ఆంధ్రజ్యోతి):
గత నెల 22న మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన రాజపు గున్నమ్మ.. చెరువు వద్ద ‘ఉపాధిహామీ’ పనులు చేస్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక పడిపోయింది. ఆ సమయంలో ప్రథమ చికిత్స కిట్టు అందుబాటులో లేదు. తోటి వేతనదారులంతా ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యసేవలు అందిన కొద్దిసేపటి తర్వాత ఆమె కోలుకుంది.
గత నెల 26న సరుబుజ్జిలి మండలం ఇసుకపాలేం గ్రామానికి చెందిన గుజ్జల గన్నిరాజు ఉపాధిహామీ పనులు చేస్తుండగా కుప్పకూలి మృతి చెందాడు. పనిచేసే చోట ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ప్రాథమిక చికిత్స కిట్లు కానీ లేకపోవడంతో తోటి వేతనదారులంతా నిస్సహాయంగా ఉండిపోయారు.
ఈ నెల 8న టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన అనపాన పార్వతి చెరువు పనులు చేస్తుండగా మృతి చెందింది. ఆమెను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ నెల 8న ఇచ్ఛాపురం మండలం చిన్నా లక్ష్మీపురానికి చెందిన దున్న దుర్యోధన చెరువు పనులు చేస్తుడంగా కుప్పకూలి మృతి చెందాడు. కనీసం ప్రాథమిక వైద్యసేవలు అందించడానికి కూడా మందులు అందుబాటులో లేకపోవడంతో దుర్యోధన మృతి చెందాడని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
...................
వేసవివేళ.. కనీస సౌకర్యాలు లేక ఉపాధిహామీ వేతనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత 40 డిగ్రీలకుపైగా పెరగడంతో కొంతమంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం ఒక్కరోజే జిల్లాలో ఇద్దరు మృతి చెందడంతో వేతనదారులంతా ఆందోళన చెందుతున్నారు. పనులు చేసే చోట్ల టెంట్లు కానీ, తాగునీటి సదుపాయం కానీ లేదని వాపోతున్నారు. కుప్పకూలి పడిపోయినా.. ప్రాథమిక వైద్యం అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లు లేవని పేర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఆ సమయంలో అధికారులు సైతం ప్రథమ చికిత్స కిట్లతోపాటు సౌకర్యాల కోసం ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకూ కల్పించలేదని కూలీలు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 3.84 లక్షల జాబ్కార్డులు ఉండగా.. 6.18 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ప్రస్తుతం 2 లక్షల మంది వేతనదారులు పనులకు వెళ్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో వేతనదారులు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేసేవారు. ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసేలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి సారించడం లేదని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదాల సమయంలో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
అదనపు వేతనం లేదు
గతంలో వేసవిలో ఉపాధిహామీ కూలీలకు అదనపు వేతనం ఇచ్చేవారు. వేసవిలో పనులు చేయడం కష్టమనే ఉద్దేశంతో మార్చిలో 20శాతం, ఏప్రిల్, మే నెలలో 30శాతం అదనంగా డబ్బులు ఇచ్చేవారు. అలాగే పరికరాలకు సంబంధించి ఒక్కో వేతనదారుడికి రోజుకు తాగునీటి కోసం రూ.5, గునపానికి రూ.10, తట్టకు రూ.3 చొప్పున చెల్లించేవారు. 20 మంది వేతనదారులు నెలకు రూ.1000 చొప్పున మజ్జిగ కోసం డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవేవీ లేవని వేతనదారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని, అదనపు వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పనికి రాకపోతే బతుకు లేదు
ఎండలు మండుతున్నా.. ఉపాధి పనులు చేయకపోతే నాకు బతుకు లేదు. మూడు రోజులుగా ఎండతోపాటు వేడిగాలులు వీస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి నీడ సౌకర్యం కల్పించాలి.
- రాము, వేతనదారుడు, పెద్దపెద్మాపురం
కష్టంగా ఉంది
గతంలో పనుల వద్ద వైద్యకిట్లతోపాటు టెంట్లు ఉండేవి. తాగునీరు, మజ్జిగ ఇచ్చేవారు. ప్రస్తుతం అటువంటి ఏమి లేవు. పనులు చేయాలంటే కష్టంగా ఉంది.
- రామారావు, వేతనదారుడు, పెద్దపద్మాపురం
ప్రతిపాదనలు పంపాం
ఉపాధిహామీ పనులు చేసేచోట్ల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం వేతనదారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నాం. నీడనిచ్చేలా పందిర్లు ఏర్పాటు చేస్తాం. వృద్ధులు పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని మేట్లను ఆదేశించాం.
- నర్సింహ ప్రసాద్పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి