May day: హక్కుల కోసం పోరాడుదాం
ABN , Publish Date - May 02 , 2025 | 12:14 AM
May day rally ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తిగా హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేద్దామని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్మిక సంఘాల నేతల పిలుపు
వాడవాడలా మేడే వేడుకలు
అరసవల్లి, మే 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తిగా హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలు చేద్దామని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకూ భారీ ర్యాలీ చేశారు. వందలాది మంది ఎర్రజెండాలు చేతబూని కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. డప్పులు, వాయిద్యాలు, కర్రసాముతో చైతన్యవంతంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీనియర్ కార్మికులను ఘనంగా సత్కరించారు. సీఐటీయూ సీనియర్ నాయకుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయి. ఆ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్యమవ్వాలి. పెట్టుబడిదారీ విధానం అంపశయ్యపై ఉంది. ప్రపంచానికి సోషలిజమే ప్రత్యామ్నాయమ’ని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కిషోర్, గిరిధర్, ఎం.శ్రీనివాస్, పోస్టల్ యూనియన్ నాయకుడు జ్యోతీశ్వరరావు, ఎం.గోవర్థనరావు, సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాష్రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.భీమారావు, కె.అప్పన్న, ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, ఏపీఎంఎస్ఆర్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వాసుదేవరావు, సతీష్, మహేష్, శ్రీనివాస్, మునిసిపల్ నాయకులు ఎన్.బలరాం, కళాసీ సంఘ నాయకులు బి.చిన్నారావు, కృష్ణవేణి, రాజేశ్వరి, మధ్యాహ్న భోజన, ఆశా, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.