Ponds dry: చెరువులు ఎండిపోతున్నాయ్
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:11 AM
Water scarcity Drying lakes జిల్లాలో సాగునీటి వనరులున్నా... నీటి నిల్వ సరిగ్గా లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా చెరవుల్లో అరకొర నీటి నిల్వలే దర్శనమిస్తున్నాయి.
410 చోట్ల చుక్కనీరు కూడా లేదు
జిల్లాలో అరకొరగా నీటినిల్వలు
కానరాని మరమ్మతులు
ఖరీఫ్ వేళ.. ఆందోళనలో రైతులు
శ్రీకాకుళం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి వనరులున్నా... నీటి నిల్వ సరిగ్గా లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా చెరవుల్లో అరకొర నీటి నిల్వలే దర్శనమిస్తున్నాయి. 410 చెరువుల్లో చుక్కనీరు కూడా లేకపోవడంతో ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలో మొత్తం 6,422 సాగునీటి చెరువులు ఉన్నాయి. మొత్తం 9.85 టీఎంసీ నీరు నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం 6.69 టీఎంసీ మాత్రమే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం చెరువుల్లో 67.91 శాతం నీరు చేరింది. 2,849 చెరువులు మాత్రమే శతశాతం నీటితో నిండుగా ఉన్నాయి. 1,123 చెరువులు 75శాతం, 1,451 చెరువులు యాభై శాతం, 588 చెరువులు 25 శాతం నీటితో ఉన్నాయి. 410 చెరువులు పూర్తిగా అడుగంటిపోయాయి. ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వంశధార నీరు ఆధారంగా అధిక విస్తీర్ణం సాగువుతుంది. వర్షంతోపాటు వంశధార నది నీరు పంట కాలువల ద్వారా చెరువుల్లో చేరగా... ఆ నీటిని రైతులు వినియోగించి సాగు చేస్తారు. కాగా ఈ ఏడాది వేసవిలో చెరువుల్లో పూర్తిస్థాయి మరమ్మతులు.. నీటి నిల్వచేసేలా పకడ్బందీ పనులు నిర్వహించలేదు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. చెరువుల్లో అరకొరగానే నీటినిల్వలు ఉండటం.. ఆందోళనకరమైన విషయమే.
కొన్ని చెరువులు.. దీనస్థితిలో..
జిల్లాలో చాలా చెరువులు నీరు లేక ఎండిపోయాయి. టెక్కలి మండలం మదనగోపాలసాగరం చెరువులో కాస్త నీరు మాత్రమే ఉంది. రెండు రోజులు ఎండ తీవ్రంగా కాస్తే.. ఆ నీరు కూడా ఆవిరి అయిపోతుంది. సరుబుజ్జిలి మండలం షలంత్రిలోని చేపలవాని చెరువులో చుక్కనీరు కూడా లేదు. గడ్డి కూడా పెరగలేదని దుస్థితి నెలకొంది. కంచిలి మండలం ఒరియానారాయణపురం సమీపంలోని జగన్నాయకుల చెరువు ఎండిన పొలం మాదిరిగా కనిపిస్తోంది. పలాస మండలం లొద్దభద్ర వద్ద హరిసాగరంలో.. అక్కడక్కడా గోతుల్లో నీరు ఉంది. గార మండలం వాడాడ వద్ద చెరువులో చుక్కనీరు లేదు. మెళియాపుట్టి మండలం పెద్దచెరువు అడుగంటింది. కవిటి మండలం నెలవంక గ్రామంలో చెరువుదీ అదే దుస్థితి. రణస్థలం మండలం కంబాల చెరువులో గడ్డి కూడా ఎండిపోయింది. ఇదిలా ఉండగా అధికారిక లెక్కలు ప్రకారం.. సరుబుజ్జిలి, రణస్థలం మండలంలో సాగునీటి చెరువులు నూరు శాతం నీటితో నిండిపోయాయని గణాంకాలతో వెల్లడిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సగానికిపైగా చెరువుల్లో నీటి ఆనవాళ్లు లేవు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లాలో చెరువుల మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నీటినిల్వలు ఉండేలా పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వల శాతం ఇలా..
===========================================================================
మండలం నూరు శాతం 75 శాతం 50 శాతం 25 శాతం ఖాళీ
===================================================================================
ఆమదాలవలస 1 0 0 0 1
బూర్జ 284 11 0 0 3
ఎచ్చెర్ల 193 0 0 1 5
జి.జిగడాం 319 1 0 1 0
గార 0 34 52 2 3
హిరమండలం 102 15 33 6 0
ఇచ్ఛాపురం 0 0 0 115 45
జలుమూరు 3 6 316 2 2
కంచిలి 9 0 4 194 35
కవిటి 1 0 1 79 30
కోటబొమ్మాళి 44 14 37 2 224
కొత్తూరు 25 360 0 0 0
లావేరు 339 0 0 1 0
ఎల్.ఎన్.పేట 11 14 123 22 0
మందస 78 40 54 4 0
మెళియాపుట్టి 51 136 92 5 3
నందిగాం 43 94 144 104 16
నరసన్నపేట 2 1 90 0 0
పలాస 171 12 4 1 1
పాతపట్నం 42 140 116 4 5
పోలాకి 0 3 151 0 0
పొందూరు 127 0 0 1 3
రణస్థలం 348 0 0 0 0
సంతబొమ్మాళి 125 41 5 0 18
సారవకోట 182 71 83 10 1
సరుబుజ్జిలి 92 0 0 0 0
సోంపేట 69 0 0 0 1
శ్రీకాకుళం రూరల్ 2 53 69 6 6
టెక్కలి 43 65 72 28 8
వజ్రపుకొత్తూరు 143 12 2 0 0
=================================================================================
మొత్తం 2,849 1,123 1,451 588 410
================================================================================