వైభవంగా కంచమ్మతల్లి సంబరాలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:07 AM
ఏడు గ్రామాల ఇలవేల్పు కంచమ్మతల్లి సంబరాలు కంచిలిలో ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఆకట్టుకున్న విద్యుత్ దీపాలంకరణ
ప్రత్యేక ఆకర్షణగా ఇస్రో గేట్
పది రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు
కంచిలి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఏడు గ్రామాల ఇలవేల్పు కంచమ్మతల్లి సంబరాలు కంచిలిలో ఆదివారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల ప్రారంభవేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కంచమ్మ దేవాలయం నుంచి బాణసంచా మెరుపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతాళాలతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తూ ఉపాలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో పదిరోజుల పాటు పూజలందుకున్న అనంతరం తిరిగి గ్రామదేవతను ప్రధాన ఆలయంలోనికి తీసుకువెళ్లనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. సంబరాల సందర్భంగా మండల కేంద్రం కంచిలితో పాటు దత్తత గ్రామాల్లో విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు. కంచిలి మెయిన్రోడ్డులో ఏర్పాటు చేసిన గేట్లు, ఇతర హోర్డింగ్లు ఆకట్టుకున్నాయి. ఇస్రో వైభవాన్ని తెలిపేలా జాతీ య రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన గేటు ఆకర్షణగా నిలిచింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులతోపాటు దత్తత గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.