postel scam: ఇక్కడా.. భద్రత లేదా?
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:15 AM
postel scam at icchapuram కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలు, అత్యవసర వైద్యసేవలు నిమిత్తం చాలామంది డబ్బులు పోస్టాఫీసు, బ్యాంకుల్లో దాచుకుంటుంటారు. కాగా, ప్రైవేటు సంస్థల మాదిరి.. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఆన్లైన్ మోసాలు జరుగుతుండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మోసాలేనా?
సిబ్బంది చేతివాటంతో ఖాతాదారులకు ఇక్కట్లు
పోస్టాఫీసుల్లో కానరాని అధికారుల పర్యవేక్షణ
ఇచ్ఛాపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి):
తాము డబ్బులు ఎక్కడ దాచుకుంటే.. భద్రత లభిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. ఇటీవల ఇచ్ఛాపురం పోస్టాఫీసులో కొంతమంది సిబ్బంది చేతివాటం కారణంగా భారీ ఆన్లైన్ మోసం బయటపడడంతో ఖాతాదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి సంబంధం ఉండదు. అందుకే వీటి పర్యవేక్షణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట జిల్లాలో అగ్రిగోల్డ్ సంస్థ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ప్రారంభంలో ఆ సంస్థ డిపాజిట్లపై అనుకున్నస్థాయిలో చెల్లింపులు చేయడంతో లక్షలాది మంది ఖాతాదారులు పెరిగారు. కానీ సదరు సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి ఇతర వ్యాపారాల్లో పెట్టింది. క్రమేపీ ప్రజలకు చెల్లింపులు నిలిపివేసింది. తరువాత బోర్డు తిప్పేసింది. దీంతో గత ఏడేళ్లుగా బాధితులు డిపాజిట్ల నగదు కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. తాజాగా ఇచ్ఛాపురంలోని పోస్టాఫీసులో స్కాం చర్చనీయాంశమవుతోంది. పోస్టాఫీసులో కట్టిన సొమ్ముకు భద్రత, రక్షణ, జవాబుదాదీతనం ఉంటుంది. బీమా సైతం వర్తిస్తుంది అన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అదే శాఖలో సొంత సిబ్బంది మోసాలకు తెరలేపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఆ శాఖపై ఉందని పలువురు ఖాతాదారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీ ఖాతాదారునికి న్యాయం చేస్తాం
ఇచ్ఛాపురం పోస్టాఫీసులో జరిగిన రూ2.78కోట్ల కుంభకోణంపై జిల్లా పోస్టల్ ఆఫ్ సూపరింటెండెంట్ హరిబాబు దృష్టి సారించారు. మంగళవారం పోస్టాఫీస్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, క్లయిమ్లను పరిశీలించారు. అప్పటికే ఖాతాదారులు అక్కడకు చేరుకుని తమ డబ్బులు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. ఖాతాదారులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి, రాజు పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులందరికీ వడ్డీతో సహా పోస్టాఫీసులో దాచుకున్న డబ్బులను త్వరలో తిరిగి ఇచ్చేస్తామని హరిబాబు హామీ ఇవ్వడంతో శాంతించారు. మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడంతో ఖాతాదారులంతా పోస్టాఫీసుకు చేరుకున్నారు. తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయో.. లేదో.. పరిశీలించుకునేందుకు బారులుదీరారు.
రికవరీ చేస్తాం
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ అధికారి హరిబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోస్టల్లో కొంతమంది స్వార్థపరులు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి ఆన్లైన్ మోసానికి పాల్పడ్డారు. ఇచ్ఛాపురం పోస్టాఫీసు పరిధిలో 15 బ్రాంచ్లు ఉన్నాయి. సుమారు 35వేల మంది ఖాతాదారులు ఉన్నారు. 33 మంది ఖాతాదారుల నుంచి రూ.2.78 కోట్లు గల్లంతయ్యాయని గుర్తించారు. ఇంకా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. పోస్టల్ ఖాతాకు ఖాతాదారులు ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. అలా చేస్తే డబ్బులు డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా ఫోన్ ద్వారా సమాచారం వస్తుంది. వెంటనే అప్రమత్తం కావచ్చు. ఖాతాదారులు ఏ బ్రాంచ్ పోస్టాఫీసులోనైనా ఖాతాల్లో డబ్బులు ఉన్నాయో లేవో పరిశీలించుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాం. వారి ద్వారా ఈడీకి కూడా ఈ కేసు వెళ్తుంది. త్వరలో నేరగాళ్లను పట్టుంటాం. డబ్బులు రికవరీ చేసి.. ఖాతాదారులకు అందజేస్తామ’ని తెలిపారు. పోస్టల్ ఏజెంట్లను కూడా విచారణ చేస్తామని స్పష్టం చేశారు.
దొంగ పాస్పుస్తకాలతో మోసం....
2017లో ఏజెంట్ ద్వారా కేవీపీ బాండ్లు రూపంలో మా కుటుంబంలో 11మంది పేర్లతో రూ.11లక్షలు డిపాజిట్ చేశాం. కుంభకోణం బయటపడిన తర్వాత మాకు ఇచ్చిన పాస్బుక్స్, బాండ్లు పరిశీలించగా.. నకిలీవేనని తేలింది. మేము దాచుకున్న డబ్బులు ఎలా వస్తాయి?. మా పిల్లల చదువులు, వివాహాల కోసం దాచుకుంటే.. ఇప్పుడు మోసపోయాం. మాకు న్యాయం చేయండి.
- చాట్ల లోహిదాస్రెడ్డి, బాధితుడు, బెల్లుపడ
డబ్బులు వస్తాయో.. రావో..
పోస్టల్లో ఆడపిల్లల పేరున రూ.8లక్షలు డిపాజిట్ చేశాం. ప్రస్తుతం మా ఖాతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మా డబ్బులు వస్తాయో.. రావో.. అన్న ఆందోళన కలుగుతోంది.
కదంబాల కిరణ్మయి, బాధితురాలు, ఇచ్ఛాపురం
అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఉంటుంది. పోస్టల్, బ్యాంకుల్లో కచ్చితత్వం ఉంటుంది. సిబ్బంది మోసాలే వెలుగు చూస్తున్నాయి. కానీ సంబంధిత సంస్థలు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఇటీవల ఆర్థికపరమైన నేరాలు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దళారులు, ఏజెంట్ల మాయ మాటలు నమ్మవద్దు. అధిక వడ్డీ ఆశచూపే వారి వలలో పడొద్దు. మోసం జరిగిన తరువాత పోలీసులను ఆశ్రయించినా.. రకరకాల కారణాలు చూపుతూ ఆర్థిక సంస్థల నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. ప్రజలు ముందే మేల్కొంటే చాలా మంచిది.
- మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం