Irrigation water supply: శివారు భూములకూ సాగునీరు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:18 PM
Agricultural development జిల్లాలో శివారు గ్రామాల్లో భూములకు సైతం సాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఎరువులపై ఫిర్యాదులు రాకూడదు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శివారు గ్రామాల్లో భూములకు సైతం సాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలి. కాలువల్లో పూడికతీతలు వేగవంతం చేయాలి. అవసరమైన తాత్కాలిక సిబ్బందితో పిచ్చిమొక్కలు తొలగించాలి. చెరువుల్లో నీరు నిల్వ చేయాలి. సాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించాలి. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి. రైతుసేవా కేంద్రాల్లో కూడా నిల్వలు ఉంచాలి. జిల్లాలో ఏ ఒక్క రైతు నుంచి కూడా ఎరువులు అందలేదని ఫిర్యాదులు రాకూడదు’ అని స్పష్టం చేశారు. సమావేశంలో అధికారులు ఆర్.అప్పారావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.