Inter classes: కాలేజీకి వేళాయే
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:54 PM
Junior colleges Academic year నూతన విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. ఇంటర్మీడియట్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యలోనూతన విద్యావిధానాన్ని ప్రవేశపెడుతోంది.
నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం
ఈ ఏడాది కొత్త సిలబస్ అమలు
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు
నరసన్నపేట/ హిరమండలం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): నూతన విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. ఇంటర్మీడియట్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యలోనూతన విద్యావిధానాన్ని ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేలా సంస్కరణలు తీసుకురానుంది. ప్రభుత్వ కళాశాల విద్యార్థులను ప్రథమ సంవత్సరం నుంచే నీట్, ఐఐటీ, ఈఏసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేలా సిలబస్ను రూపొందించింది. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38, ప్రైవేటు కళాశాలలు -71, మోడల్ స్కూల్స్లో కళాశాలలు -13, కెజీబీవీలు -25, సోషల్వెల్ఫేర్ ఆధ్వర్యంలో -9, ట్రెబుల్ వెల్ఫేర్లో -1, ప్లస్-1 జూనియర్ కళాశాలలు -9, మహాత్మ జ్యోతిరావుపూలే మహిళ కళాశాల- 1 ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 20,678 మంది విద్యార్థులు ఈఏడాది ద్వితీయ ఇంటర్ చదవనున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని ఆధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కళాశాలల్లో వసతులపై అవగాహన కల్పించారు. అడ్మిషన్లు చేపట్టారు. ఇంకా సప్లిమెంటరీ పరీక్షలు రాసిన పది విద్యార్థులను కూడా అడ్మిషన్లు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇంటర్లో ప్రథమ సంవత్సరం నుంచి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు గణితం ఏ, బీ పేపర్లు స్థానంలో ఒకే పేపర్కు పరీక్ష నిర్వహిస్తారు. జువాలజీ, బోటనీ కలిపి బయాలజీ పేరుతో ఒకే పేపరును అమలు చేస్తారు. ఈ ఏడాది నుంచి ఎంబైపీసీ అనే కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది చదివిన వారు ఎంసెట్, నీట్ రెండూ రాసుకునే వీలుంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివేవారికి విద్యార్థి మిత్ర పథకం కింద ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలను అందజేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా నీట్, ఐఐటీ, ఈఏ సెట్(ఎంసెట్) తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రోత్సహించేలా మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూతన సిలబస్ మేరకు బోధిస్తారు. మధ్యాహ్నాభోజనం పథకాన్ని కొనసాగిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లు చేశామని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే ప్రిన్సిపాల్స్, అధ్యాపకుల బదిలీ పక్రియ కూడా సోమవారంతో ముగియనుంది. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఈనెల 8లోగా బదిలీ అయిన స్థానాల్లో విధుల్లో చేరనున్నారు.