Road accident: వారం కిందటే వచ్చి వెళ్లారు
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:39 PM
Police officer death తెలంగాణ రాష్ట్రంలో రోడ్డుప్రమాదంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ, సీఎం స్పెషల్ సెక్యూరిటీ అధికారి(ఎస్.ఎస్.జీ) జల్లు శాంతారావు(56) మృతి చెందడంతో.. ఆయన స్వగ్రామం పోలాకి మండలం డోలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ శాంతారావు దుర్మరణం
స్వగ్రామం డోలలో విషాదఛాయలు
పోలాకి, జూలై 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో రోడ్డుప్రమాదంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ, సీఎం స్పెషల్ సెక్యూరిటీ అధికారి(ఎస్.ఎస్.జీ) జల్లు శాంతారావు(56) మృతి చెందడంతో.. ఆయన స్వగ్రామం పోలాకి మండలం డోలలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం స్టేజి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందగా, మరో ఏఎస్పీ, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒక డీఎస్పీ శాంతారావుది పోలాకి మండలం డోల గ్రామం. శాంతారావు దుర్మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. శాంతారావు వారం రోజుల కిందటే గ్రామానికి వచ్చి.. అందరితో సరదాగా గడిపారని, ఇంతలోనే మృతి చెందడం బాధాకరమని ఆయన బంధువు జే.శివరాం, గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. శాంతారావు మృతదేహం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు తన సిబ్బందితో డోల గ్రామానికి వెళ్లి.. మృతుడి బంధువులను పరామర్శించారు. మృతదేహాన్ని త్వరగా తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని అధైర్యపడవద్దని తెలిపారు. అలాగే శాంతారావు దుర్మరణంపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, కరిమిరాజు, ఎం.వి.నాయుడు, ఎస్ఐ రంజిత్కుమార్ ద్రిగ్భాంతి వ్యక్తంచేశారు.
ఐదుగురి సీఎంల వద్ద విధులు..
ఇంటెలిజెన్స్ డీఎస్పీ శాంతారావు పోలాకి, వెదుళ్లవలస గ్రామ పాఠశాలల్లో విద్యనభ్యసించారు. పోలీస్ విభాగ పోటీ పరీక్షలు రాసి 1992లో ఉమ్మడి హైదరాబాద్ రాజధానిలో కానిస్టేబుల్గా తర్వాత సీఐగా పదోన్నతి పొందారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఎంల వద్ద సెక్యూరిటీ సీనియర్ గ్యాంగ్(ఎస్.ఎస్.జి) ఇంటెలిజెన్సీ సీనియర్ అధికారిగా(డీఎస్పీ స్థాయి) విధులు నిర్వర్తించారు. మంచి అధికారిగా వారి మన్ననలు పొందారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్ద సెక్యూరిటీ వింగ్ విభాగంలో డీఎస్పీగా ఆయన పని చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యమిదీ..
డీఎస్పీ శాంతారావుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు బాలగంగాధర్తిలక్, శ్రీరామ్ ఉన్నారు. శాంతారావు దంపతులు అమరావతిలో నివసిస్తున్నారు.పెద్ద కుమారుడు తిలక్కు 2023లో వివాహమైంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీరామ్ ఉన్నత చదువు నిమిత్తం రెండేళ్ల కిందట ఽథాయిలాండ్ వెళ్లాడు. శాంతారావు సోదరుడు జల్లు జగన్నాయకులు హైదరాబాద్లో నివాసముంటున్నారు. శాంతారావుకు డోలలో సొంతిల్లు ఉంది. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవారని బంధువులు తెలిపారు.