విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపండి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:35 PM
Welfare of the disabled విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పాత శ్రీకాకుళం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వైద్య సదుపాయాలు, కృత్రిమ అవయవాలు, మూడు చక్రాల వాహనాలు, వీల్చైర్స్, శ్రవణ యంత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. ‘స్వాభిమాన్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా దివ్యాంగుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. దృష్టి లోపం ఉన్న వికలాంగులకు రిమ్స్ ఆసుపత్రిలో ఏఐ ఆధారిత ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవలు అందించిన విద్యార్థులను ప్రశంసించారు. దివ్యాంగులకు ప్రభుత్వం గృహాలు, కుటుంబ పింఛను, రిజర్వేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి కలెక్టర్, ఎమ్మెల్యేలు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏడీ శైలజ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.