Rain: ఉక్కపోత.. కుండపోత
ABN , Publish Date - May 13 , 2025 | 12:09 AM
Heavy rain fall జిల్లాలో సోమవారం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం పిడుగుల మోత... ఈదురుగాలుల బీభత్సంతో కుండపోత వర్షం కురవడంతో భయాందోళన చెందారు.
ఉదయం భానుడి ప్రతాపం
సాయంత్రం గాలీవాన బీభత్సం
జిల్లాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు
శ్రీకాకుళం/ సరుబుజ్జిలి/ జి.సిగడాం/ సంతబొమ్మాళి/ హిరమండలం, మే 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం పిడుగుల మోత... ఈదురుగాలుల బీభత్సంతో కుండపోత వర్షం కురవడంతో భయాందోళన చెందారు. శ్రీకాకుళంలో సాయంత్రం 4.30 గంటల నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. పిడుగులు పడి సరుబుజ్జిలి మండలంలో ఒకరు మృతి చెందగా.. జి.సిగడాం మండలంలో కొబ్బరిచెట్లు దగ్ధమైంది. ఆమదాలవలస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో సుమారు అరగంటపాటు వర్షం కురిసింది. కాలువల్లో మురుగునీరు.. రోడ్లపై వర్షపునీటితో కలసి ప్రవాహాన్ని తలపించింది. ఉద్దానం, మైదాన ప్రాంతాల్లో మామిడి, జీడిమామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. శ్రీకాకుళంలో పెద్దపెద్ద చెట్టు గాలికి విరిగిపోయాయి. మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం.. మళ్లీ ట్రిప్ అవ్వడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
సోమవారం నమోదైన వర్షపాతం మిల్లీమీటర్లలో..
--------------
ఆమదాలవలస(మున్సిపాలిటీ) 46.25
శ్రీకాకుళం (రాగోలు) 45.0
ఎచ్చెర్ల 26.75
శ్రీకాకుళం (ఆర్ట్స్ కళాశాల) 17.5
పలాస 14.5
మందస 14.25
పాతపట్నం (జగ్గిలిబొంతు) 14.25
ఇచ్ఛాపురం(అరకభద్ర) 10.0
హిరమండలం 9.5
రణస్థలం (పైడిభీమవరం) 9.5
టెక్కలి (రావివలస) 9.25
పొందూరు 8.0
లావేరు 5.25
కంచిలి 3.5
మెళియాపుట్టి 2.5
పిడుగుపడి ఒకరి మృతి
సరుబుజిల్జి మండలంలో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. పాలవలస గ్రామానికి చెందిన దాసరి అప్పన్న(47) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అప్పన్న ఎప్పటిలాగానే చిగురువలస పంచాయతీ పరిధిలోని తాడికొండ వద్ద గొర్రెల మందను మేతకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఉరుములు.. మెరుపులతో పిడుగు పడడంతో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంతబొమ్మాళి మండలం మర్రిపాడు లో పిడుగుపాటు గురై బడ్డ మల్లేషుకు చెందిన ఆవు మృతి చెందింది. పొలంలో ఆవు మేత మేస్తుండగా పిడుగు పడి మృతి చెందిందని మల్లేషు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తమకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.
జి.సిగడాం మండలం ఎస్పీఆర్ పురంలోని ఓ కొబ్బరిచెట్టుపై సోమవారం సాయంత్రం పిడుగు పడింది. బ్రాహ్మణవీధిలో ఐవీ అప్పారావు ఇంటి సమీపంలో పిడుగు పడగా.. కొబ్బరిచెట్టు కాలి ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సరుబుజ్జిలి మండలంలో ఈదురుగాలులు ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. దీంతో సుమారు ఐదు గంటలు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పాలకొండ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి సరుబుజ్జిలి 33 కేవీ సబ్స్టేషన్కు రావాల్సిన విద్యుత్ వైరుపై నీలగిరి చెట్టు కూలిపోయింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. రాత్రి 8 గంటలైనా పునరుద్ధరణ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.