Share News

Rain: ముసురేసింది

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:27 AM

It keeps raining ముసురు కమ్ముకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా సోమవారం ఉదయం నుంచి చిరుజల్లుతో ప్రారంభమై.. మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి భారీగానే కురిసింది.

Rain: ముసురేసింది
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నిలిచిన వర్షపునీరు.. మురుగునీరు

జిల్లాపై అల్పపీడన ప్రభావం

ఏకధాటిగా వర్షం.. సిక్కోలు జలమయం

నేడు కూడా ఇదేరీతిన కురిసే అవకాశం

శ్రీకాకుళం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ముసురు కమ్ముకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా సోమవారం ఉదయం నుంచి చిరుజల్లుతో ప్రారంభమై.. మోస్తరుగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి భారీగానే కురిసింది. రెండురోజులపాటు వర్షాలు భారీగా కురిసే అవకాశముందని.. జిల్లాప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం కూడాను భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలో ఎప్పటిలానే ఆర్టీసీ కాంప్లెక్స్‌, పలువార్డులు జలమయమయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో.. వ్యవసాయ పనులను జోరు పెంచారు రైతులు. పలుచోట్ల పొలాల్లోకి వెళ్లిన వ్యవసాయ కూలీలు.. కొద్దిసేపటికే భారీ వర్షం కారణంగా పనులను నిలిపివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితి అన్ని మండలాల్లో ఏర్పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలియడంతో వర్షం తగ్గే వరకు వ్యవసాయ పనులను వాయిదా వేసుకున్నారు. ముసురు కారణంగా వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రజలు.. నగర జనం.. చిరువ్యాపారులు.. కార్మికులు అవస్థలకు గురయ్యారు. అంతటా పంట పొలాలు జలమయమై చెరువులను తలపించాయి.

Updated Date - Aug 26 , 2025 | 12:27 AM