Railway: రైల్వే వంతెనలకు గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:50 PM
Railway Bridges ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే గేట్ల స్థానంలో వీటిని నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గేట్ల స్థానంలో 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఈస్టుకోస్టు ఉత్తర్వులు
ప్రజలకు తీరనున్న రవాణా కష్టాలు
ఇది ఇచ్ఛాపురం పట్టణంలోని రత్తకన్న రైల్వే ఎల్సీ గేటు వద్ద పరిస్థితి(పై ఫొటో). ఇక్కడ గేటు పడిందా.. అంతే సంగతులు. గంటల తరబడి ఇరువైపులా వాహనాలు నిలిచిపోతాయి. ఇక్కడ ఫ్లైఓవర్(వంతెన) నిర్మించాలని దశాబ్దాలుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నా ఫలితం శూన్యం. ఎట్టకేలకు అది సాకారం కానుంది. ఇక్కడ వంతెన నిర్మించేందుకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. ఇలాంటి వంతెనలు ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 12 చోట్ల నిర్మించున్నారు.
ఇచ్ఛాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే గేట్ల స్థానంలో వీటిని నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి హైవేల ఆధునికీకరణలో భాగంగా రైల్వే లైన్లు ఉన్న ప్రతిచోటా ఫ్లైఓవర్లు నిర్మించారు. పట్టణాలకు ఉన్న రోడ్లలో మాత్రం రైల్వేగేట్లు ఉండిపోయాయి. దీంతో ప్రజలు ప్రయాణాల సమయంలో నరకయాతన పడుతున్నారు. ఇప్పుడు ఫ్లైఓవర్లు మంజూరు కావడంతో రవాణా కష్టాలు తీరనున్నాయి.
ఎక్కడెక్కడంటే..
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు సమీపంలో రైల్వేక్రాసింగ్ నంబర్ 326, 329, 330, 334 వద్ద వంతెనలు రానున్నాయి. అంటే ఒక్క ఇచ్ఛాపురం పట్టణంతో పాటు రూరల్ పరిధిలో నాలుగు రహదారులకు ఫ్లైఓవర్లు రానున్నాయన్న మాట. జాడుపూడి రైల్వేస్టేషన్ పరిధిలో 341 లెవల్ క్రాసింగ్ వద్ద, సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో 343 క్రాసింగ్ వద్ద వంతెనలు నిర్మించనున్నారు. సోంపేట-బారువ రైల్వేస్టేషన్ల మధ్య 345, 348, 351 లెవల్ క్రాసింగ్ల వద్ద, బారువ నుంచి మందస రైల్వేస్టేషన్ల మధ్య 353, 354, 358 లెవల్ క్రాసింగ్ల వద్ద వంతెనలు నిర్మించనున్నట్టు ఈస్టుకోస్టు రైల్వేశాఖ ముఖ్య ఇంజనీర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గేటుపడితే నరకమే..
జిల్లాలో ఎక్కడా లేని విధంగా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజలు రైల్వేగేట్లతో నరకయాతన పడుతున్నారు. ఎటు వెళ్లాలన్నా ప్రతి రోడ్డులో రైల్వే గేట్లు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కాశీబుగ్గ సమీపంలోని ఎల్సీ గేటును దాటాల్సి ఉంటుంది. వజ్రపుకొత్తూరు వెళ్లాలంటే తాళ్లభద్ర ఎల్సీ గేటు దాటాలి. ఈ రెండు గేట్లు పలాస రైల్వేస్టేషన్కు అటు ఇటుగా ఉంటాయి. దీంతో రైలు ఆగినా.. నిలిచినా.. గేటు అలానే మూసి వేసి ఉంటుంది. మందస మండల ప్రజలకు కొర్రాయిగేటు, బాలిగాం, కొత్తపల్లి గేట్లు నరకయాతన చూపిస్తుంటాయి. సోంపేట మండలంలో పాలవలస, కొర్లాం గేట్ల వద్ద నిత్యం అదే పరిస్థితి. కంచిలి మండలానికి సంబంధించి బూరగాం, అంపురం, గొల్ల కంచిలి రైల్వేగేట్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పురుషోత్తపురం, రత్తకన్న, జగన్నాథపురం రైల్వేగేట్లతో ఇచ్ఛాపురం పట్టణ ప్రజలు పాట్లు పడుతున్నారు. ఎట్టకేలకు 12 చోట్ల వంతెనల నిర్మాణం జరగనుండడంతో ప్రజలకు కష్టాలు తప్పనున్నాయి. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని రెండు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు.
శుభ పరిణామం
రైల్వే గేట్లతో నరకయాతన పడుతున్నాం. ఇచ్ఛాపురం పట్టణానికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. దశాబ్దాలుగా వంతెన నిర్మాణం అనేది కల. ఎట్టకేలకు రైల్వేశాఖ వంతెన నిర్మాణానికి ముందుకు రావడం శుభ పరిణామం. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలి. ప్రజలకు రవాణా కష్టాలు తీర్చాలి.
- సుగ్గు ప్రేమ్, ఇచ్ఛాపురం
......................
కష్టాలు తీరుతాయి
ఇటీవల విశాఖ రైల్వేజోన్లో ఈ ప్రాంతాన్ని కలపకుండా అన్యాయం చేశారు. అయితే ఇప్పుడు ఈస్టుకోస్టు రైల్వేజోన్ అధికారులు 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. దీంతో ప్రజలకు రోడ్డు రవాణా కష్టాలు తీరుతాయి. శరవేగంగా పనులు పూర్తిచేయాలి.
- కట్టా సూర్యప్రకాష్, డీఆర్యూసీసీ సభ్యుడు, ఇచ్ఛాపురం