Gold scams: ‘గోల్డ్’మాల్!
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:57 PM
Jewelry fraud.. Victims cheated నరసన్నపేటలో కొందరు బంగారం వ్యాపారులు మాయాజాలంతో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు మిల్లీగ్రాముల్లో తుకాల్లో తేడాలకు పాల్పడుతుంటే... మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి ఉన్నట్లు నకిలీ పత్రాలతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
నరసన్నపేటలో బంగారం మాయలెన్నో
బిల్లులు లేకుండా విక్రయాలు
మిల్లీగ్రాముల్లో చిలక్కొట్టుడు
టెస్టింగ్ కేంద్రాలతో మిలాఖత్
అనుమతి లేకుండా షాపుల నిర్వహణ
నరసన్నపేట, జూలై 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో కొందరు బంగారం వ్యాపారులు మాయాజాలంతో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు మిల్లీగ్రాముల్లో తుకాల్లో తేడాలకు పాల్పడుతుంటే... మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి ఉన్నట్లు నకిలీ పత్రాలతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇంకొందరు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా ఎస్టిమేట్ కాగితాల్లో లెక్కలను అప్పగించి వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. నరసన్నపేటలో సుమారు 300కు పైగా బంగారం షాపులు ఉన్నాయి. వీటిలో హోల్సేల్ 12 వరకు ఉండగా... మిగతావన్నీ రిటైల్ షాపులు. వీటిని ఇళ్లు, షాపుల్లో నడిపిస్తున్నారు. బంగారం షాపు నిర్వహించాలంటే బీఐఎస్ అనుమతి తప్పనిసరి. ఆభరణాలకు హాల్మార్కు ఉండాలి. అయితే నరసన్నపేటలో సగానికి పైగా షాపులకు ఎటువంటి అనుమతులు లేకపోవడమే కాకుండా కొందరు పాత అనుమతులతో షాపులను నిర్వహిస్తున్నారు. కొందరు వ్యాపారులు డమ్మీ లేబుల్స్తో హాల్మార్క్ ఉన్నట్లు విక్రయిస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద షాపుల్లో కూడా డమ్మీ హాల్మార్క్తో కిలో ఆభరణాలు విక్రయించిన వైనాన్ని బీఐఎస్ అధికారులు ఈ నెల 17న జీఎన్ఆర్(గుడ్ల నాగరాజు) బంగారం షాపులో గుర్తించారు. ఒక్క జీఎన్ఆర్ మాత్రమే కాదు...అనేక షాపుల్లో ఇదే తంతు కొనసాగుతోంది. బీఐఎస్ అధికారులు దాడులు చేసే సమయంలో మిగతా బంగారు వర్తకులు షాపులు మూసివేసి పరుగులు తీశారంటే.. ఎన్ని లొసుగులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
తూకాల్లో చేతివాటం
కొందరు బంగారు వ్యాపారులు తుకాలతో వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. గ్రాము ధర రూ.10వేలకుపైనే ఉంది. మిల్లీగ్రాము ధర రూ.100 పడుతుంది. కొందరు వ్యాపారులు ఆభరణాలు విక్రయించే సమయంలో మిల్లీగ్రాముల్లో వచ్చిన విలువను లెక్కల్లో చూపకుండా.. గ్రాముల్లో వినియోగదారుల దగ్గర దోచుకుంటున్నారు. నెలవారీ స్కీమ్స్ కట్టే వినియోగదారులకు మిల్లీగ్రాములతో సహా ధరను మదింపు చేస్తారు. అదే వినియోగదారులు వారికి విక్రయిస్తే గ్రాముల్లో ధరను మదింపు చేసి దోచుకుంటున్నారు.
అంతా ఎస్టిమేట్ రూపంలోనే ...
పట్టణంలో కొందరు వ్యాపారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఎటువంటి బిల్లులు ఇవ్వడం లేదు. కొందరైతే నగదు చెల్లిస్తేనే ఆభరణాలు విక్రయిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు ఒప్పుకోవడం లేదు. పెళ్లిళ్లకు బంగారు ఆభరణాలు బెత్తాయించే సమయంలో ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా ఎస్టిమేట్ పత్రాల మీద అడ్వాన్సులు తీసుకుంటున్నారు. ఆభరణాలు విక్రయించే సమయంలో కూడా ఇదే తంతును కొనసాగిస్తున్నారు. సక్రమంగా వ్యాపారాలు సాగిస్తే ప్రభుత్వానికి 4శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఎగనామం పెట్టేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
టెస్టింగ్ కేంద్రాలతో ఒప్పందం
నరసన్నపేటలోని బంగారం షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసి నాణ్యతను పరిక్షించేందుకు టెస్టింగ్ కేంద్రానికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. ఆభరణంపైన ఉన్న ముద్ర ఆధారంగా.. టెస్టింగ్ ఏజెన్సీ వారు నాణ్యత పరిశీలిస్తారు. ఆ సమయంలో నాణ్యత ఏమేరకు నిర్ధారించి విక్రయించారో యాజమానికి ఫోన్చేసి తెలుసుకొని... ఆయన చెప్పిన విధంగా ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని టెస్టింగ్ కేంద్రాలు బంగారు వ్యాపారుల పెట్టుబడితో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేంద్రాల్లో నాణ్యత పరిశీలించే వ్యక్తికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేనివారే అధికశాతం ఉంటున్నారు.
యాసిడ్ తో మాయ
కొందరు బంగారు వ్యాపారులు యాసిడ్ వేసి బంగారాన్ని కరిగించి వాటిని 100 గ్రాముల కడ్డీ రూపంలో బీఐఎస్ మార్కుతో విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో 80-90 శాతం బంగారం ఉండగా... మిగతా ఇతర లోహాలు ముఖ్యంగా కాపర్ మిక్స్ చేస్తారు. ధగధగ మెరిసేందుకు కొన్ని రసాయనాలను కలిపి... స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంలా బిస్కెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.
బంగారు వర్తకులకు తెల్లరేషన్ కార్డులు
నరసన్నపేటలో కోట్లాది రూపాయల బంగారు వ్యాపారాలు చేసే కొందరు వర్తకులకు తెల్లరేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహించడంతో వీరి లావాదేవీలు అంతా బ్లాక్లోనే సాగుతుంటాయి. కొందరు వ్యాపారులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతో ఇటీవల ప్రభుత్వం అందించే తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన సంఘటనలూ ఉన్నాయి.
అంతా సిండికేట్
బంగారు వ్యాపారులు నరసన్నపేటలో సిండికేట్గా వ్యవహరిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. షాపుల టర్నోవర్ మేరకు నెల నెలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు. దీని కోసం గుమస్తాను కూడా నియమిస్తారు. వీరు వసూలు చేసిన మొత్తంలో కొంత నెలవారీగా పోలీసులు, జీఎస్టీటీ అధికారులకు, విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్, తూనికల శాఖ అధికారులకు ముడుపులుగా చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.