భూ సర్వేలో అక్రమాలపై అన్నదాతల ఆందోళన
ABN , Publish Date - May 14 , 2025 | 12:25 AM
కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో గతంలో జరిగిన భూసర్వే అక్రమాలను సరిదిద్ది, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం తహసీల్దారు కార్యాల యాన్ని రైతులు ముట్టడించారు. తమ సమస్యలను తహసీల్దారు బాల కృష్ణకు విన్నవించారు. గ్రామంలో సుమారు 350 మంది రైతుల భూములను ఇతరుల పేర్లతో నమోదు చేసి సర్వే అధికారులు తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కొత్తూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): కర్లెమ్మ రెవెన్యూ పరిధిలో గతంలో జరిగిన భూసర్వే అక్రమాలను సరిదిద్ది, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం తహసీల్దారు కార్యాల యాన్ని రైతులు ముట్టడించారు. తమ సమస్యలను తహసీల్దారు బాల కృష్ణకు విన్నవించారు. గ్రామంలో సుమారు 350 మంది రైతుల భూములను ఇతరుల పేర్లతో నమోదు చేసి సర్వే అధికారులు తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై గత పది నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ గ్రామంలో కనీసం సెంటు భూమిలేని వ్యక్తులకు భూమి ఉన్నట్లు జాయింట్ ఖాతాలు చూపి.. సర్వేలో భూములు ఉన్నట్లు నమోదు చేసి తగాదాలకు కారణంగా నిలుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కూడా ఇతరుల పేరుతో నమోదు చేసి రైతుల్లో గందరగోళం సృష్టించారని వివరించారు. నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తాని ఇటీవల టెక్కలి ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చి రెండు నెలలు దాటుతున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తమ పేరున ఉన్న భూములకు ఇతరుల పేరుతో నమోదు చేయటం వల్ల బ్యాంకు రుణాలు రెన్యువల్ చేయడానికి, ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు స్పష్టం చేశారు.