పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:41 PM
పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ సారధ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో మంగళవారం 30 వేల వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు.
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
అరసవల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ సారధ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో మంగళవారం 30 వేల వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని సంరక్షించడం దేశ సేవ అని, మట్టి గణేశ ప్రతిమలను వినియోగించడం ద్వారా కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. పదేళ్లుగా మట్టి వినా యక ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నామని, ఈ సంవత్సరం పర్యావరణ శాఖ, క్రెడాయ్ సహకారంతో 30వేల ప్రతిమలు, వ్రతకథ పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు వి.సుధారాణి, డి.సురేంద్ర, క్రెడాయ్ ప్రతినిధులు రమేష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమల విగ్రహాల పంపిణీ చేపట్టారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను నమోదు చేసుకున్న 3 వేల మందికి ఇళ్ల వద్ద అందజేశారు. మంగళవారం సూర్యమహల్ జంక్షన్ వద్ద స్టాల్ ఏర్పాటు చేసి 10 వేల ప్రతిమలను పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడులకు మట్టి వినాయక ప్రతిమలను మంత్రి కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ అందజేశారు.