Ration: రేషన్ డిపోల్లోనే సరుకుల పంపిణీ
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:50 PM
Public distribution system ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ అందజేస్తామ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే అందజేస్తాం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ అందజేస్తామ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన అరసవల్లిలోని డీసీఎంఎస్ వద్ద గల రేషన్ డిపోను పునఃప్రారంభించారు. అలాగే అరసవల్లిలోని బొంపాడ వీధిలోని ఒక దివ్యాంగుడికి, వృద్ధురాలికి స్వయంగా ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘జిల్లాలో 1,603 రేషన్ డిపోల పరిధిలో 6.60 లక్షల కార్డులు ఉన్నాయి. అందులో దివ్యాంగులు, 65ఏళ్లు దాటిన వృద్ధులు 75 వేలమంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల వద్దకే సరుకులు అందజేస్తాం. మిగిలిన లబ్ధిదారులందరికీ ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. ఉదయం 8 గంటల నుండి 12 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సరుకులను తీసుకోవచ్చు. ప్రస్తుతం, బియ్యం పంచదార ఇస్తున్నాం. ఏ డిపో పరిధిలోనైనా సమస్యలుంటే కంట్రోల్ రూం, డీఎస్ఓకు, సచివాలయ సిబ్బందికి తెలియజేయండి’ అని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి సూర్యప్రకాష్, సీఎస్డీటీ చక్రి, 25వ వార్డు ఇన్చార్జి టి.నాగరత్నం, ఉంగటి వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.