మళ్లీ తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:08 AM
పలాస మండలంలో కంకర తవ్వకాలు మళ్లీ యథేచ్ఛగా సాగుతున్నాయి.
- గంగువాడలో కంకర కోసం యథేచ్ఛగా..
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
పలాస రూరల్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పలాస మండలంలో కంకర తవ్వకాలు మళ్లీ యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల కేదారిపురం, లొద్దభద్ర, రాజగోపాలపురం ప్రాంతాల్లో కొండల వద్ద కంకరను యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వేశారు. ట్రాక్టర్లతో అక్రమ రవాణా సాగించారు. కేదారిపురం పంచాయతీ కంబిరిగాం వద్ద కంకర డంపింగ్ చేశారు. అలాగే రామకృష్ణాపురం ఉజ్జుడిమెట్ట వద్ద కంకర తవ్వకాలు చేపట్టారు. దీనిపై పత్రికల్లో కథనాలు రాగా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కంబిరిగాం వద్ద డంపింగ్పై జరిమానా విధించారు. దీంతో అక్రమార్కులు కొన్నిరోజులపాటు తవ్వకాలు నిలిపివేశారు. కానీ మళ్లీ గత మూడు రోజుల నుంచి గంగువాడ ప్రాంతంలోని కొండల అంచుల్లో ఉన్న కంకరను గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ తవ్వేసి.. ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని.. కంకర తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డీవో వెంకటేష్ వద్ద ప్రస్తావించగా తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.