Srikakulam celebrations : వజ్రోత్సవ సందడి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:41 PM
‘Run for Srikakulam’ rally in full swing జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వజ్రోత్సవ సందడి నెలకొంది. బుధవారం శ్రీకాకుళంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ(ఆర్ట్స్) కళాశాల వద్ద ‘రన్ఫర్ శ్రీకాకుళం’ ర్యాలీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రారంభించారు.
ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
ఉత్సాహంగా ‘రన్ఫర్ శ్రీకాకుళం’ ర్యాలీ
జిల్లా 75ఏళ్ల ప్రస్థానాన్ని యువత తెలుసుకోవాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వజ్రోత్సవ సందడి నెలకొంది. బుధవారం శ్రీకాకుళంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ(ఆర్ట్స్) కళాశాల వద్ద ‘రన్ఫర్ శ్రీకాకుళం’ ర్యాలీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రారంభించారు. ఏడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, జిల్లావాసులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు దేశనాయకుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అలాగే కేఆర్ స్టేడియంలో స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్లో పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ‘రన్ఫర్ శ్రీకాకుళం’ ర్యాలీ ప్రారంభం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇన్నేళ్ల జిల్లా ప్రస్థానం, చరిత్ర, అభివృద్ధిని యువత తెలుసుకోవాలి. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. జిల్లా ఆవిర్భావ వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముగుస్తాయి. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ను అందరూ సందర్శించాలి. జిల్లా ఔన్నత్యాన్ని తెలుసుకునేందుకు భావితరాలకు ఇది ఒక మంచి అవకాశమ’ని తెలిపారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘వజ్రోత్సవం.. జిల్లా చరిత్ర, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక. జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ‘దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉంది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటుకుని నేడు జిల్లా ఈ స్థితికి చేరుకుంది. ఎందరో మహనీయుల కృషి, త్యాగాలు వెలకట్టలేనివి. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాం. పండుగ వాతావరణంలో ఉత్సవాలు ప్రారంభం కావడం, వందలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.