Temple Development: శ్రీకూర్మం, అరసవల్లి అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:12 AM
Tourism Infrastructure Development జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీకూర్మం, అరసవల్లిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకూర్మం క్షేత్రాన్ని, అరసవల్లి దేవాలయాన్ని ఆయన సందర్శించారు.
అవసరమైన సిబ్బందిని నియమిస్తాం
దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
గార/ అరసవల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీకూర్మం, అరసవల్లిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకూర్మం క్షేత్రాన్ని, అరసవల్లి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీకూర్మం క్షే త్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్రంలో సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర దేవాలయాలను కేం ద్ర పురావస్తుశాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో అభివృద్ధి చేశాం. శ్రీకూర్మం, అరసవల్లి క్షేత్రాలు పరిశీలించి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తాం. ఇటీవల శ్రీకూర్మంలో తాబేళ్ల మృత్యువాత పడిన సంఘటన బాధాకరం. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల’ని తెలిపారు. అలాగే అరసవల్లిలో డీసీ స్థాయి ఆలయానికి కావలసిన సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన అభ్యర్థన పంపాలని ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్కు ఆదేశించారు. అలాగే మంగళవాయిద్యాలకు సంబంధించి క్షురకులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. తమకు కేవలం రూ.9వేలు మాత్రమే నెలకు జీతం ఇస్తున్నారని, కుటుంబాలతో బతకడం కష్టంగా ఉందని, కనీస వేతనం ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి.. సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే శ్రీకూర్మంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.