Share News

Devolpment: అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:08 AM

Achievement of goals ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Devolpment: అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, గ్రామ సచివాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘పల్లె పండుగ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఉపాధిహామీ పథకం కింద వేతనదారులకు పని దినాలను పెంచాలి. గృహ నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలి. కాలువలు, చెత్త కుప్పల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాలి. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి. చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణం పూర్తి చేయని 200 పంచాయతీలు వివరణ ఇవ్వాల’ని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే-ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్‌ బ్యాంకు, కోర్టు కేసులు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇంటి నుంచి పని, పి-4 సర్వే, ఎంఎస్‌ఎమ్‌ఈ సర్వే తదితర అంశాలపై ఆయా అధికారులు సమగ్ర వివరాలు అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్‌ పద్మావతి, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీవో భారతి సౌజన్య, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్‌, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌.ఈ. కృష్ణమూర్తి, హౌసింగ్‌ పీడీ నగేష్‌, జిల్లాలోని ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:08 AM