welfare schemes: అభివృద్ధి మెండుగా.. సంక్షేమం నిండుగా..
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:04 AM
public welfare social development ‘కూటమి పాలనతో పల్లెలో ప్రగతి కనిపిస్తోంది. అభివృద్ధి మెండుగా.. సంక్షేమం నిండుగా ప్రభుత్వ పాలన సాగుతోంద’ని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస మండలం లోహరిబందలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన పర్యటించారు.
కూటమి పాలనలో ప్రగతి ఫలాలు
గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
హరిపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ‘కూటమి పాలనతో పల్లెలో ప్రగతి కనిపిస్తోంది. అభివృద్ధి మెండుగా.. సంక్షేమం నిండుగా ప్రభుత్వ పాలన సాగుతోంద’ని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస మండలం లోహరిబందలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన పర్యటించారు. వృద్ధులు, మహిళలు, యువతతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు. రూ.90లక్షలతో నిర్మించిన లోహరిబంద రోడ్డు, రూ.1.60కోట్లుతో నిర్మించిన ఎల్ కొత్తూరు- మర్రిపాడు తారురోడ్డును ప్రారంభించారు. అనంతరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దాసరి తాతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు పేదలకు సంక్షేమం అందజేస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ‘ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు కానుకగా ఇవ్వనున్నారు. విద్యార్థులకు కిట్లు, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నాం. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామ’ని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, బావన దుర్యోధన, రట్టి లింగరాజు, తమిరి భాస్కరరావు, చంద్రశేఖర్, మండల లచ్చయ్య, దేబాసిస్ పండా, బొంగుదామోదరం, నవీన్, సాలిన మాధవరావు పాల్గొన్నారు.
అక్రమార్కులను వదిలే ప్రసక్తేలేదు
మందస మండలం నల్లబొడ్లూరులో కంకర కొండను తవ్వి గ్రావెల్ దోచుకుపోయిన అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కంకర కొండను ఆయన పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇళ్లపట్టాలు, పాఠశాల క్రీడా మైదానం పేరుతో విన్యాసాలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు తెలియజేయటంతో అవాక్కయ్యారు. కొండలనే మాయం చేసిన ఘనులు ఇక్కడ ఉన్నారని, వైసీపీ నాయకుల ధనదాహానికి ప్రకృతి వనరులు బలయ్యాయని మంత్రి విమర్శించారు. ఆధికారులు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.