aciident: గ్రానైట్ రాయి.. ప్రాణం తీసింది
ABN , Publish Date - May 17 , 2025 | 11:37 PM
Granite quarry Fatal accident శ్రీకాకుళం మండలం సింగుపురంలోని కేజీబీవీ సమీపంలో హైవేపై శనివారం వేకువజామున రెప్పపాటులో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో గ్రానైట్ రాయి పడి ఒకరు మృతి చెందగా, లారీని ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి తీవ్రగాయాలయ్యాయి.
సింగుపురం హైవేపై రెప్పపాటులో రెండు ప్రమాదాలు
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు.. 15 మందికి గాయాలు
అదే ప్రాంతంలో గ్రానైట్ లారీ సడెన్బ్రేక్
లారీ ముందుభాగంపై బండ పడి డ్రైవర్ మృతి
శ్రీకాకుళం రూరల్, మే 17(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలం సింగుపురంలోని కేజీబీవీ సమీపంలో హైవేపై శనివారం వేకువజామున రెప్పపాటులో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో గ్రానైట్ రాయి పడి ఒకరు మృతి చెందగా, లారీని ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జైపూర్ నుంచి శ్రీకాకుళం మీదుగా బర్హంపూరానికి ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో సింగుపురం హైవే వద్ద... ముందున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు బస్సుడ్రైవర్ యత్నించాడు. అదే సమయంలో ముందున్న లారీడ్రైవర్... తన వాహనాన్ని కాస్త స్లో చేశాడు. వెనుక ఉన్న బస్సు... ఆ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. కానీ బస్సు ముందుభాగం.. లారీ వెనుక భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదంతా వేకువజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. సమాచారం అందడంతో హైవే సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలతో ఉన్న మరికొంతమంది.. మరో వాహనంలో బర్హంపూర్ వెళ్లిపోయారు.
అయితే క్షతగాత్రులను అంబులెన్స్లో తరలింపు.. ఇటు హైవేపై వాహనాల మళ్లింపు జరుగుతుండగానే మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అదే రోడ్డుపై నాలుగు లారీలు వస్తున్నాయి. అందులో రెండు లారీలు గ్రానైట్ బండలను టెక్కలికి తరలిస్తుండగా.. మరో రెండు లారీలు ఇతర సరుకులతో హైవేపై నుంచి వెళ్తున్నాయి. ముందుగా బస్సు ప్రమాదం జరిగిన చోటుకు రాగానే... గ్రానైట్ బండలతో వెళ్తున్న లారీడ్రైవర్ బ్రేక్ వేశాడు. భారీ సైజు బండలు కావడంతో.. లారీలో ఉన్న ఓ బండ ఏకంగా ముందుభాగంపై పడింది. దీంతో లారీ ముందుభాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ రాపర్తి నూకరాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ముందు భాగం నుజ్జుకావడంతో.. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు వచ్చి ప్రత్యేక యంత్రాలతో భాగాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే లారీ ఢీకొన్ని ఘటనలో... అదే రోడ్డుపై దానికి ముందున్న లారీలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. పరిమితికి మించిన గ్రానైట్ బండలను లారీలపై తరలించడం.. సడెన్ బ్రేక్ వల్ల బండ ముందుకు కదిలిపోవడం ప్రమాదానికి కారణమైంది. బండలను తరలిస్తున్నప్పుడు వాటిని కట్టకుండా లారీలతో తరలించేయడం దారుణం. నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి తరహా ప్రమాదాల సంభవిస్తునే ఉన్నాయి. సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడపునాయుడు, ఎస్ఐలు హరికృష్ణ, రాము పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన వ్యక్తిగా మృతుడ్ని గుర్తించి అక్కడకు పోలీసులు సమాచారం చేరవేశారు.
