p-4 Target: సమష్టిగా పీ-4 లక్ష్యసాధనకు కృషి
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:51 PM
P-4 goals development targets ప్రజా సంక్షమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 75,566 బంగారు కుటుంబాల గుర్తింపు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి కార్యక్రమం వివరాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలను గుర్తించాం. ఇప్పటివరకు 181 కుటుంబాలను దత్తత తీసుకున్నాం. ఇంకా 75,385 కుటుంబాలు దత్తత కోసం ఎదరుచూస్తున్నాయి. ఈ నెల 15వ తేదీలోగా 59,124 కుటుంబాల దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేశాం. పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా 11,572 కుటుంబాలను గుర్తించాం. ఎచ్చెర్లలో 11,024, శ్రీకాకుళంలో 10,324 కుటుంబాలు ఉన్నాయి. దత్తత విషయంలో ఇచ్ఛాపురం నియోజకవర్గం 107 కుటుంబాలతో ముందంజలో ఉంది. కార్యక్రమం పర్యవేక్షణ కోసం 37 మంది మార్గదర్శకులను నియమించాం. పీ-4 కార్యక్రమం కేవలం దాతృత్వ కార్యక్రమం కాదు. గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించి, స్వయంగా ఇతర గ్రామాలకు సహాయపడే శాశ్వత సామాజిక ఉద్యమంగా భావించాలి. ప్రతీ ఒక్కరూ చొరవ తీసుకుని ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాల’ని జిల్లాప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.