‘మూలపేట’ పోర్టుపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:16 AM
Mulpet’ port reviews మూలపేట పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీ కేంద్రంగా విశాఖ
శ్రీకాకుళం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. వీఈఆర్ పరిధిలో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్కోనసీమతో పాటు శ్రీకాకుళం జిల్లా కూడా ఉంది. ఈ రీజియన్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు.. చేపట్టాల్సిన ప్రాజెక్టులు.. పెట్టుబడుల ఆకర్షణపై యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఏడు గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి, గ్లోబల్పోర్టు, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ-హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతులు సాధించాల్సి ఉంది. ప్రస్తుత ఆపరేషన్లో ఉన్న విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులతోపాటు కొత్తగా కాకినాడ గేట్ వే, మూలపేట పోర్టులు నిర్మిస్తారు. కొత్తగా ఏడు రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ మేర వైజాగ్ మెట్రో కూడా ఇందులో ఉంటాయి. ఐదు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు ఉంటాయి. మూలపేట పోర్టుపై ఇందులో సమీక్ష చేపట్టి.. ప్రస్తుతం పనులు, కనెక్టివిటీ, ఇతరత్రా విషయాలపై కలెక్టర్ను సీఎం అడిగి తెలుసుకున్నారు. విశాఖను నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీ కేంద్రంగా చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.