Chain Snatchers: అమ్మో.. గొలుసు దొంగలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:28 PM
Women targeted జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. దుండగులు బైక్లపై వచ్చి రోడ్లపై ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళలను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారవుతున్నారు. ఆరుబయట, ఇళ్లలో నిద్రిస్తున్న మహిళలను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
జిల్లాలో వరుసగా చోరీలు
ఒంటరి మహిళలే టార్గెట్
బైక్పై వచ్చి బంగారు ఆభరణాలను తెంచుకొని పరారీ
పలాస, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):
గత నెల 5వ తేదీ రాత్రి కొత్తూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన అగతముడి కళావతి ఇంటిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న తులం పుస్తెల తాడును తెంపుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
.................
గత నెల 12న పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోద ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు బస్సు కోసం వేచి ఉంది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలో ఉన్న రెండు తులాల మంగళసూత్రం, అరతులం బంగారు శతమానం, ఆభరణాలు లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అంచనా.
....................
గత నెల 30న కంచిలి మండలం అమ్మవారిపుట్టుగకు చెందిన బొడ్డ అమ్ముడమ్మ ఇంటి వెనుక గదిలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 1.30గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పరారయ్యారు. వీటి విలువ రూ.4లక్షలు ఉంటుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
.......................
జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. దుండగులు బైక్లపై వచ్చి రోడ్లపై ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళలను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారవుతున్నారు. ఆరుబయట, ఇళ్లలో నిద్రిస్తున్న మహిళలను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ఇటీవల పలాస-కాశీబుగ్గ కేటీ రోడ్డులో రద్దీగా ఉన్న మార్కెట్లోనే ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలోని ఆభరణాలను తెంచుకుని దుండగుడు పరారయ్యాడు. సీసీ కెమెరాలు, హైవేపై నిఘా, ప్రత్యేక సాయుధ పోలీసులు, ఇంటెలిజెన్స్తో పాటు నిత్యం ట్రాఫిక్ పోలీసుల పహరా ఉంటున్నా చైన్స్నాచర్లు రెచ్చిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కిందట వరకూ చైన్స్నాచర్లు ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వరకూ ఉన్న హైవేపై గొలుసు దొంగతనాలకు పాల్పడేవారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టి చాకచక్యంగా పట్టుకోవడంతో చాలావరకూ అటువంటి నేరాలు తగ్గాయి. అయితే కొందరు యువకులు జల్సాలకు అలవాటుపడి, మద్యం తాగేందుకు, ప్రేయసికి గిఫ్ట్లు ఇచ్చేందుకు చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట పలాసలో జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసుకు సంబంధించి ఇచ్ఛాపురానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఆ యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఇంటిలో ఉన్న బంగారాన్ని అమ్మాడు. దాన్ని రికవరీ చేసుకోవడానికి చైన్స్నాచర్గా మారినట్లు పోలీసులకు చెప్పాడు. గ్రామాల్లో ఎక్కువగా మహిళలు ఒంటరిగానే పనులు నిర్వహిస్తుంటారు. అటువంటి వారిపై అపరిచిత వ్యక్తులు తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. చైన్స్నాచర్లు ఎక్కువగా పల్సర్ బైక్లే వినిగిస్తున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ స్పీడ్ వెళ్లడానికి ఇటువంటి వాహనాలు వినియోగపడుతుండడంతో వాటిపైనే స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా వ్యక్తులు జెట్ స్పీడ్తో రోడ్డుపై వెళ్తుంటే అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని వాహనాలకు కనీసం నెంబరు ప్లేట్లు కూడా ఉండవు. అటువంటి వాటిపై పోలీసులు దృష్టి సారించాల్సి ఉంది. అనుమానిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే వారిని ప్రశ్నించే తత్వం ఉంటే కొంతవరకూ దొంగతనాలు అరికట్టవచ్చు. చైన్స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిఘా పెట్టాం
అన్ని గ్రామాలతో పాటు ప్రధాన పట్టణాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం. దొంగతనం చేసిన వారు పరారీ కాకుండా చూస్తున్నాం. ప్రతిరోజూ గ్రామానికో పోలీసు విజిట్ పెట్టి ప్రజలకు దొంగతనాలపై అప్రమత్తం చేస్తున్నాం. ప్రత్యేకంగా చైన్స్నాచింగ్పై నిఘా ఉంది. అన్ని విధాలా నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- వి.వెంకటఅప్పారావు, డీఎస్పీ, కాశీబుగ్గ