ప్రయాణికులుగా ఆటో ఎక్కి..
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:14 AM
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి బ్యాగ్లో ఉన్న రూ.3 లక్షలు నగదు చోరీ జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
బ్యాగును కోసి రూ.3 లక్షలు చోరీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధుడు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి బ్యాగ్లో ఉన్న రూ.3 లక్షలు నగదు చోరీ జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొందిలీపురం శివరాంనగర్ కాలనీకి చెందిన వృద్ధుడు సక్కరి సత్యాగోపి సింహ ద్వారం వద్ద ఉన్న ఎస్బీఐ లాకర్లో గతేడాది రూ.4 లక్షలు దాచుకున్నాడు. అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లాకర్ నుంచి తీసిన నగదు సింహద్వారం వద్ద ఆటో ఎక్కి బొందిలీపురం తన ఇంటికి బయలుదేరాడు. అదే మార్గంలో ఉన్న వెంకటాపురం జంక్షన్ వద్ద ముగ్గురు యువకులు ఆటో ఎక్కి కొంతదూరం ప్రయాణించి కేటీఎం ద్విచక్ర వాహనాల షోరూం వద్ద దిగిపోయారు. అయితే వృద్ధుడు సక్కరి సత్యాగోపి కొంత దూరం వెళ్లి చూసేసరికి బ్యాగ్ కట్ చేసి ఉండడాన్ని గమనించి అందులోని రూ.3 లక్షలు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.