ఉద్దానంలో ఎలుగుల హల్చల్
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:15 AM
bears roam around మందస మండలం నారాయణపురం, పెద్దకేసుపురం, గుజ్జులూరు తదితర గ్రామాల పరిధిలో ఎలుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం నారాయణపురానికి చెందిన గొరకల పాపారావు తోటకు వెళ్తుండగా.. ఒక ఎలుగుబంటి దాడి చేసింది.
- ఒకరిపై దాడి..
- ఆందోళనలో ప్రజలు
హరిపురం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మందస మండలం నారాయణపురం, పెద్దకేసుపురం, గుజ్జులూరు తదితర గ్రామాల పరిధిలో ఎలుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం నారాయణపురానికి చెందిన గొరకల పాపారావు తోటకు వెళ్తుండగా.. ఒక ఎలుగుబంటి దాడి చేసింది. చేతిలో కర్ర ఉండటంతోపాటు స్థానికులు అక్కడికి చేరుకోవడంతో చిన్నచిన్న గాయాలతో పాపారావు తప్పించుకున్నాడు. బాధితుడ్ని హరిపురం సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతున్నాడు. దాడి అనంతరం స్థానికులు ఆ ఎలుగుబంటిని తరిమేయడంతో తోటల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో పెద్దకేసుపురం, గుజ్జులూరు తోటల్లో మరో రెండు ఎలుగుబంట్లు వీరంగం సృష్టించాయి. తోటలకు పనులకోసం వెళ్లేవారిపై దాడికి యత్నించాయి. వారంతా కేకలు వేస్తు పరుగులు తీసి తప్పించుకున్నారు. కాగా గత ఏడాది ఎర్రముక్కాం, దున్నూరుతోపాటు వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎలుగుల దాడిలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామాల్లో రాత్రీపగలు ఎలుగులు సంచరిస్తుండడంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. జీడితోటలు శుభ్రం చేసే పనులకు పగలు కూడా వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుగుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.