బీచ్ ఫెస్టివల్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:15 AM
బారువ బీచ్ ఫెస్టివల్ను వచ్చే నెల 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు.
- జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): బారువ బీచ్ ఫెస్టివల్ను వచ్చే నెల 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగ ళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో, అలాగే మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ బీచ్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బీచ్ ఫెస్టివల్ ప్రత్యేకంగా ఉండాలన్నారు. సందర్శకు లకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించా లన్నారు. అలాగే పింఛన్ పంపిణీ మే 1న ఉదయం నుంచే పకడ్బందీగా పంపిణీ చేయాలని, బుధవారం నాటికి డబ్బులు విత్డ్రా చేసు కోవాలన్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఎప్పటిలాగే పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ల వివరాలు, అనుమతులు లేని లేఔట్ల సమాచారం శుక్రవారం నాటికి కలెక్టరేట్కి తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యల లేకుండా చర్యలు తీసుకోవాలి, గోకులం షెడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి, పశువులకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఫారం పాండ్లు పూర్తి చేయాలి, సూర్యఘర్ పథకం అమలులో జిల్లా స్థానం మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డీపీవో భారతీ సౌజన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.