అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:08 AM
Today *Annadatha* funds grant అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురం నియోజవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
నేడు పీఎం కిసాన్తో కలిపి రూ.7వేల చొప్పున జమ
జిల్లాలో 2,79,100 మంది రైతులకు లబ్ధి
నరసన్నపేటలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు
హాజరుకానున్న జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్, కలెక్టర్
నరసన్నపేట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురం నియోజవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాకు సంబంధించి నరసన్నపేటలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నరసన్నపేటలోని మార్కెట్యార్డు ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2,79,100 మంది రైతులకు నిధులు జమ కానున్నాయి.
టెక్కలి సబ్డివిజన్లో అత్యధికంగా..
వ్యవసాయ సబ్డివిజన్ల వారీ పరిశీలిస్తే టెక్కలిలో అత్యధికంగా నిధులు జమ కానున్నాయి. టెక్కలి సబ్డివిజన్ పరిధిలోని నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల్లో 50,301 రైతులకు రూ.35కోట్లు జమ చేస్తారు.
సోంపేట సబ్డివిజన్ పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో 30,634 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.21.44 కోట్లు జమ చేయనున్నారు.
పలాస సబ్ డివిజన్ పరిధిలోని మందస, పలాస, వజ్రపుకొత్తూరు, మొళియపుట్టి మండలాల్లో 38,138 మంది రైతులకు రూ.26.69 కోట్లు జమ కానున్నాయి.
నరసన్నపేట సబ్డివిజన్ పరిఽధిలోని నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో 37,741 మంది రైతులకు రూ.26.41 కోట్లు జమ కానున్నాయి.
శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలో శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల్లో 42,558 మంది రైతులకు రూ.29.79 కోట్లు జమ చేస్తారు.
రణస్థలం సబ్డివిజన్ పరిధిలోని జి.సిగడాం, రణస్థలం, లావేరు. పొందూరు మండలాల్లో 45,464 మంది రైతులకు రూ.31.82కోట్లు జమ కానున్నాయి.
కొత్తూరు వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని బూర్జ, హిరమండలం, కొత్తూరు, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట మండలాల్లో 34,264 మంది రైతులకు రూ.23.98కోట్లు జమ చేయనున్నారు.
పారదర్శకంగా..
కూటమి అధికారంలోకి వస్తే సాగుకు ఆర్థిక భరోసా కింద ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6వేల చొప్పున మొత్తంగా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలను అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి నగదు అందించనున్నారు. ఇప్పటికే ఆగస్టు 2న మొదటి విడత అందించారు. బుధవారం రెండో విడత అందించనున్నారు. చివరి విడతలో కేంద్రంతో కలిపి రూ.6వేలు జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ పథకాన్ని అమలుచేస్తోంది. సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రచురించింది. ఈకైవైసీ చేయించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులు, వెబ్ల్యాండ్లో తప్పిదాలు సరిచేసేందుకూ గడువు ఇచ్చింది. తొలివిడత జమకాని రైతుల నుంచి కూడా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి అర్హులందరికీ ఈ పథకం కింద నిధులు జమచేయనున్నారు.