Share News

irrigation: 18 ఏళ్ల కన్నీటి గాథ!

ABN , Publish Date - May 09 , 2025 | 11:39 PM

irrigation problem రాజుల పాలనలో మందస మండలం బెల్లుపటియా వద్ద చీపి గెడ్డపై నిర్మించిన ఇనుప దోనె(ఆక్వాడెక్టు)వందల ఏళ్లపాటు రైతులకు ఎంతో సేవలందించింది. మహేంద్రతనయా నీటి కోసం రైతుల సౌకర్యార్థం నిర్మించిన ఈ దోనె.. 2007లో భారీ వర్షాల ఉధృతికి ఒకవైపు గట్టు కొట్టుకుపోయి కూలిపోయింది.

irrigation: 18 ఏళ్ల కన్నీటి గాథ!
బెల్లుపటియా వద్ద కూలిన ఆక్వాడెక్ట్‌

  • - మరమ్మతులకు నోచుకోని దోనె

  • - లక్షలాది రూపాయలు వృథా

  • - అన్నదాతల్లో ఆందోళన

  • - కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

  • హరిపురం, మే 9(ఆంధ్రజ్యోతి):

  • మందస మండలం బెల్లుపటియా వద్ద పద్దెనిమిదేళ్ల కిందట భారీ వర్షాలకు కూలిన ఇనుప దోనె(ఆక్వాడెక్ట్‌) ఇది(పైచిత్రం). లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా నిరుపయోగంగా మారింది. గతంలో కాంగ్రెస్‌ నాయకుల చేతివాటంతో నిధులు పక్కదారి పట్టడంతో అన్నదాతలకు ఆక్రందన మిగిలింది. నాటినుంచి నేటికీ ఇలాగే కన్పిస్తోంది.

    ............

  • లక్షల రూపాయలు ఖర్చుచేసినా కనీసం చుక్కనీరు పొలాలకు అందకపోవటంతో రైతులంతా సొంత డబ్బులతో బెల్లుపటియా వద్ద ఆక్వాడెక్ట్‌పై ఇలా పైపులు వేసుకుని నీటిని తరలిస్తున్నారు. అయినా ఏడాది పొడవునా శివారు భూములకు సాగునీరందక పొట్ట దశలో వరి పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వమే స్పందించి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.

    ..............

  • రాజుల పాలనలో మందస మండలం బెల్లుపటియా వద్ద చీపి గెడ్డపై నిర్మించిన ఇనుప దోనె(ఆక్వాడెక్టు)వందల ఏళ్లపాటు రైతులకు ఎంతో సేవలందించింది. మహేంద్రతనయా నీటి కోసం రైతుల సౌకర్యార్థం నిర్మించిన ఈ దోనె.. 2007లో భారీ వర్షాల ఉధృతికి ఒకవైపు గట్టు కొట్టుకుపోయి కూలిపోయింది. మందస మండలంలో డబార్సింగి, కళింగదల్‌, సునాముది వంటి నీటివనరుల తరువాత అంతే స్థాయితో సుమారు 1200 ఎకరాలకు అధికారికంగా, మరో 2,250 ఎకరాలకు అనధికారికంగా ఈ అక్వాడెక్టు నుంచి నీరందుతుంది. మహేంద్రతనయా నది నుంచి వచ్చే నీటిని చీపిగెడ్డకు అడ్డంగా ఈ దోనెను నిర్మించారు. దీంతో మందస, సోంపేట మండలాల పరిధిలో సుమారు 12గ్రామాలకు సాగునీరందేది. కాగా కొన్నేళ్ల కిందట వరద ఉధృతికి దోనె కూలిపోయింది. దీంతో మహేంద్రతనయా నీరు రాక పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. ఈ క్రమంలో రైతులంతా సొంత డబ్బులతో ప్లాస్టిక్‌ గొట్టాలు అమర్చి నీటిని తరలించి సాగు చేపట్టారు. రైతు ప్రభుత్వమంటూ కాంగ్రెస్‌ నాయకులు 2009లో రూ.51లక్షలతో దోనె పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొంత నిధులు ఖర్చుచేసి తూతూమంత్రంగా పనులు చేపట్టి అర్థాంతరంగా నిలిపివేశారు. పద్దెనిమిదేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. అలాగే ఇనుపదోనె ముందు భాగంలో మరో రూ.3లక్షలతో సిమెంట్‌ కాలువ నిర్మించారు. నాణ్యతాలోపంతో పదినెలలు కూడా ఈ కాలువ లేదు. బీటలు దేరి నీరు రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దోనె పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్‌నాటికైనా సాగునీరందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • ఈ విషయమై జలవనరుల శాఖ ఏఈఈ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. దోనెను పరిశీలించి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి దోనె పునర్నిర్మించేలా కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 11:39 PM