‘అమృత్ భారత్’ వచ్చేసింది
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:43 PM
PM Modi launched the virtual event జిల్లాకు ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసింది. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి సూరత్ వరకూ రాకపోకలు సాగించనున్న ఈ ప్రత్యేక రైలు పట్టాలెక్కింది. శనివారం బరంపూర్ రైల్వేస్టేషన్ వద్ద అమృత్భారత్ రైలును ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
బరంపురం నుంచి సూరత్ వరకూ ఎక్స్ప్రెస్ రైలు
వర్చువల్ విధానంలో ప్రారంభించిన పీఎం మోదీ
శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో కేంద్రమంత్రి స్వాగతం
రైల్వేసేవలు మెరుగుపరుస్తామని రామ్మోహన్ వెల్లడి
ఆమదాలవలస, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసింది. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి సూరత్ వరకూ రాకపోకలు సాగించనున్న ఈ ప్రత్యేక రైలు పట్టాలెక్కింది. శనివారం బరంపూర్ రైల్వేస్టేషన్ వద్ద అమృత్భారత్ రైలును ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో ‘అమృత్భారత్’కు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆచరిస్తున్న ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంతోపాటు జిల్లా కూడా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో రైల్వేసేవలు మెరుగుపరుస్తాం. గతంలో వందేభారత్, ఇప్పుడు అమృత్భారత్ రైళ్లరాకపోకలతో జిల్లావాసులకు మరిన్ని సేవలు అందనున్నాయి. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్, తిరుపతి ప్రాంతాలకు ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషి చేస్తున్నా. పలాస రైల్వేస్టేషన్లో రూ.64కోట్లతో అభివృద్ధి పనులు చేపడతాం. వివిధ స్టేషన్లలో అన్ని రకాల ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రైల్వే డీఆర్ఎం లలిత్ మొహ్రా, డీసీఎం పూజసింగ్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పేడాడ రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.