Arasavalli : ఆదిత్యాలయ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:41 PM
Activities in the sanitation survey ఆదిత్యాలయంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులను ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆలయంలో సేవలపై భక్తుల నుంచి అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు.
పారిశుధ్యం సర్వే పేరిట చర్యలు
అరసవల్లి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి)ః ఆదిత్యాలయంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులను ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆలయంలో సేవలపై భక్తుల నుంచి అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. జూలై నెలకు సంబంధించిన సర్వేలో పారిశుధ్య నిర్వహణలో రెండు శాతం వెనుకబడడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. ఆ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఉద్యోగిపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో ప్రసాద్.. సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తోంది. నలుగురు మాత్రమే పర్మినెంట్ సిబ్బంది ఉన్నారు. ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశాం. కొన్ని విభాగాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రెగ్యులర్ సిబ్బంది కూడా నలుగురు మాత్రమే ఉన్నారు. నిజానికి డీసీ స్థాయి అలయానికి ఇద్దరు సూపరింటెండెంట్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ సిబ్బంది ఉండాలి. కానీ కార్యాలయ విఽధులకు సంబంధించి నలుగురే రెగ్యులర్ సిబ్బంది ఉండడంతో వారితోనే అన్ని పనులు చేయించాల్సి వస్తోంది. ఇప్పటికే సిబ్బంది కోసం అడిగాం. ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించేందుకు టెండర్లు ఆహ్వానించాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.