ఢీ.. ఎస్సీ
ABN , Publish Date - May 20 , 2025 | 12:32 AM
Teacher recruitment High competition ఉపాధ్యాయ కొలువుకుగానూ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా.. ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఈ నెల 15తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.
ఒక్కో టీచర్ పోస్టుకు 71 మంది పోటీ
ఉమ్మడి జిల్లాలో 543 ఉపాధ్యాయ ఖాళీలు
22,648 అభ్యర్థులు.. 39,235 దరఖాస్తులు
పురుషులు కంటే 3,342 మంది మహిళా అభ్యర్థులే అధికం
నరసన్నపేట, మే 19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ కొలువుకుగానూ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా.. ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఈ నెల 15తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. కాగా ఉమ్మడి జిల్లాలో ఒక్కో పోస్టుకు సగటున 71 మంది పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 543 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ యాజమాన్యం, జిల్లా, మండల పరిషత్ యాజమాన్యంలో అన్ని పాఠశాలల్లో 458 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 543 పోస్టులకు సంబంధించి 22,648 మంది అభ్యర్థులు.. 39,235 దరఖాస్తులు చేశారు. చాలామంది మంది రెండు అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో పురుషులు 9,653 మంది, మహిళలు 12,995 మంది ఉన్నారు. పురుషుల కంటే 3,342 మంది మహిళా అభ్యర్థులే అధికం. రిజర్వేషన్ కేటగిరీల వారీగా పరిశీలిస్తే బీసీ-డీ నుంచి అత్యధికంగా 7,281 మంది దరఖాస్తు చేసుకోగా, బీసీ-సీ నుంచి కేవలం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎటువంటి రిజర్వేషన్ లేనివారు 653 మంది, బీసీ-ఏ 5,210 మంది, బీసీ- బీ 2,737 మంది, బీసీ -ఈ నుంచి 107 మంది దరఖాస్తు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు తరువాత ఈ డీఎస్సీలో ఎస్సీ కేటగిరీ విభాగాల్లో పరిశీలిస్తే.. ఎస్సీ కేటగిరీ -1లో 516 మంది, కేటగిరీ-2 నుంచి 666 మంది, కేటగిరీ -3 నుంచి 3,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ విభాగం నుంచి 2,377 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 408 మంది, దివ్యాంగుల విభాగంలో దృష్టిలోపం ఉన్నవారు 128 మంది, వినికిడి లోపం ఉన్నవారు 32 మంది, శారీరక వైకల్యం ఉన్నవారు 441 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది అభ్యర్థులు.. కర్నూలు, విశాఖపట్నం, ఉభయగోదావరితోపాటు పలు జిల్లాల్లో కూడా పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మరింత ప్రణాళికతో సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు.. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.