postel scam: పోస్టల్లో ఇంటిదొంగలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:19 AM
Financial Irregularities.. Postal Employees Involved ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో జరిగిన భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కార్యాలయంలో 33 మంది ఖాతాదారులకు సంబంధించిన కిసాన్ వికాస్ పత్రాలు (కేవీపీ) బాండ్లు నగదు రూ.2.86 కోట్లు ఆన్లైన్ మోసం ద్వారా గల్లంతైంది.
రూ.2.86 కోట్ల భారీ కుంభకోణం
33 ఖాతాల సొమ్ము పక్కదారి..
పబ్లిక్ గ్రీవెన్స్కు ఓ వ్యక్తి ఫిర్యాదు
విచారణ చేపట్టిన శాఖ అధికారులు
ఇచ్ఛాపురం కేంద్రంగా అక్రమాలు
ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్
మరో తొమ్మిదిమంది అనుమానితులు
సైబర్ నేరగాళ్లకు సహకరించిన వైనం
లక్షా.. రెండు లక్షలు కాదు! రూ.2కోట్ల పైనే భారీ స్కాం! సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపారు. 33 మంది సొమ్ము కాజేశారు. ఎవరూ కనిపెట్టలేరని అనుకున్నారు. కానీ ఓ వ్యక్తి ఫిర్యాదుతో.. డొంకంతా కదిలింది. అధికారులు విచారిస్తే ఇంటిదొంగల యవ్వారం బయటపడింది. ఇచ్ఛాపురం పోస్టల్శాఖలో జరిగిన ఈ స్కాం శుక్రవారం వెలుగుచూసింది. ఇది తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు.
ఇచ్ఛాపురం, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో జరిగిన భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కార్యాలయంలో 33 మంది ఖాతాదారులకు సంబంధించిన కిసాన్ వికాస్ పత్రాలు (కేవీపీ) బాండ్లు నగదు రూ.2.86 కోట్లు ఆన్లైన్ మోసం ద్వారా గల్లంతైంది. ఇందులో కార్యాలయ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అధికారుల విచారణలో తేలడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు సోంపేట, పలాస పోస్టల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, శ్రీకాకుళం పోస్టల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ కమల్హాసన్ శుక్రవారం ఇచ్ఛాపురంలో పోస్టల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఏజెంట్లను, ఖాతాదారులను పిలిచి బాండ్లు విషయమై ఆరా తీశారు. ఖాతాదారులు లబోదిబోమంటూ తమగోడు వెళ్లగక్కారు. పిల్లల వివాహాల కోసం భద్రతగా ఉంటుందని, పోస్టల్లో డబ్బులు దాచుకుంటే.. చివరికి మోసపోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురంలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఇసురు బాలరాజు రూ.15లక్షలు, దుర్గాశి గంగమ్మ రూ.5లక్షలు, ధర్మపురానికి చెందిన పైల దేవమ్మ రూ.6లక్షలు, దుర్గాశి నాగమ్మ రూ.8లక్షలు, బీఎం శరణ్య మాధురి రూ.5లక్షలు ఇలా పలువురు కిసాన్ వికాస్ పత్రం ద్వారా నగదు డిపాజిట్లు చేశామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో సోంపేట, పలాస పోస్టల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో స్కాం జరుగుతోందని ఈ నెల 7న పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ (‘మీ-కోసం’) కార్యక్రమం ద్వారా ఓ బాధితుడు అనే పేరు మీద ఒక ఫిర్యాదు అందింది. ఇచ్ఛాపురంలో కేవీపీ(కిసాన్ వికాస్ పత్రం), టర్మ్ డిపాజిట్ ఖాతాలపైన అధిక మొత్తంలో లావాదేవీలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మళ్లీ రెండు రోజుల తర్వాత అదే బాధితుడు ఏరోజు ఎంత లావాదేవీలు జరిగాయో.. వాటితోపాటు కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించి మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేయగా ఆన్లైన్ ద్వారా అవకతవకలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. మా వార్షిక తనిఖీల్లో కూడా బయటపడకుండా టెక్నాలజీతో ఈ స్కాం జరిగినట్టు గుర్తించాం. దీనికి బాధ్యులుగా ఇచ్ఛాపురం పోస్టాఫీసులో ముగ్గురిని, నౌపడ, మాణిక్యం పురంలో ఒకొక్కరిని మొత్తం మొత్తం ఐదుగురి సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరో 9మంది అనుమానితులను గుర్తించి దర్యాప్తు చేస్తున్నాం. కార్యాలయం పాస్వర్డ్, యూజర్ నెంబరు, తెలిసినవారు బయట వ్యక్తులతో కుమ్మకై డబ్బులు తీస్తున్నట్లు మెసేజ్లు రాకుండా జాగ్రత్త పడ్డారు. పోస్టల్లో డిపాజిట్ చేసినట్లు ఆధారాలు ఉన్న లబ్ధిదారులందరికీ ప్రతీ రూపాయి అందుతుంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా పోయిన సొమ్ము రికవరీ అయినా అవ్వకపోయినా వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ కేసును సీబీఐకి అప్పగించాం. సీబీఐ ద్వారా ఈడీకి కూడా వెళ్తుంది’ అని తెలిపారు.
సైబర్ నేరగాళ్లతో కలిసి..
ఇచ్ఛాపురం హెడ్ పోస్టాపీసులో రూ.కోట్లలో నగదు మాయం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. సాధారణంగా పోస్టాఫీసు, ఖాతాదారు యూజర్ ఐడీ సంబంధిత ఉద్యోగుల వద్దే ఉంటుంది. ఆ యూజర్ ఐడీ హ్యాక్ చేయడమంటే చిన్న విషయం కాదు. పోస్టల్ సిబ్బందిలో ఎవరో ఒకరు సైబర్ నేరస్థుడితో చేతులు కలపడం ద్వారానే ఇంతటి భారీ స్కాం జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల డిజిటల్ లావాదేవీలు పెరిగిన దృష్ట్యా బ్యాంకింగ్ రంగంతోపాటు ఆర్థికపరమైన ప్రతి అంశానికి సైబర్ నేరాలు వెంటాడుతున్నాయి. పోస్టల్ శాఖలోనూ ఇటువంటి ఆర్థిక మోసాలు చోటుచేసుకోవడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
