22-ఏ భూములకు విముక్తి!
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:20 AM
Today is the 'Your Hand.. Your Land' mega drive అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22-ఏ)లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి - 22ఏ భూ స్వేచ్ఛ’ పేరుతో మెగా గ్రీవెన్స్(ప్రత్యేక డ్రైవ్) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
నేడు జడ్పీ హాల్లో ‘మీ చేతికి.. మీ భూమి’ మెగా డ్రైవ్
హాజరుకానున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు పిలుపు
శ్రీకాకుళం/ కోటబొమ్మాళి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22-ఏ)లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘మీ చేతికి.. మీ భూమి - 22ఏ భూ స్వేచ్ఛ’ పేరుతో మెగా గ్రీవెన్స్(ప్రత్యేక డ్రైవ్) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అర్హత కలిగిన రైతులు.. భూ యజమానులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వం భూముల రీ-సర్వే పేరుతో రికార్డులను అస్తవ్యస్తం చేసింది. రైతుల భూములను లాక్కోవాలన్న దురుద్దేశంతో అర్హత ఉన్న భూములను కూడా అక్రమంగా 22-ఏ జాబితాలో చేర్చింది. ఆ అవ్యవస్థను సరిదిద్ది బాధితులకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్లాం. రైతుల అభ్యంతరాలను స్వీకరించి రికార్డుల్లో పారదర్శకత పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు.
అధికారులంతా ఒక్కచోటే...
అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22-ఏ, 22-1ఏ, 22-1బీ, 22-1సీ, 22-1డీ జాబితాల్లో పొరపాటను లేదా అక్రమంగా చేర్చబడిన భూముల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తమ భూమి పత్రాలు, ఇతర ఆధారాలతో నేరుగా జడ్పీ హాల్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మెగాడ్రైవ్లో జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అన్నిస్థాయిల రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇప్పటికే యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. రైతులు ఇచ్చే విజ్ఞాపనలను అధికారులు అక్కడికక్కడే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
ప్రజాదర్బార్లో వినతుల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయడు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు.