Liquor Scam: రాజ్ తోడల్లుడు అరెస్టు
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:54 AM
మద్యం కుంభకోణంలో ముఖ్య నిందితుడైన చాణక్యను ఎస్ఐటీ అరెస్టు చేసింది. హవాలా మార్గంలో ముడుపులు తరలిస్తూ, రాజకీయ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

మద్యం స్కామ్లో 8వ నిందితుడిగా చాణక్య
ముడుపుల వసూళ్లు, తరలింపులో కీలక పాత్ర
మద్యం కంపెనీల ప్రతినిధులతో నిత్యం టచ్లో!
మరో ఇద్దరు సహాయకులతో కలిసి ‘కలెక్షన్లు’
ప్రభుత్వం మారగానే దుబాయ్కి జంప్.. తాజాగా రాక
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మద్యం స్కామ్లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో నిందితుడిని అరెస్టు చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసి క్యాష్ హ్యాండ్లర్లు, కొరియర్ల ద్వారా చేర్చాల్సిన చోటుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన బూనేటి ప్రకాశ్ అలియాస్ చాణక్యను అరెస్టు చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి (ఏ1) తోడల్లుడే ఈ చాణక్య! ఆయనను మద్యం కేసులో ఏ8గా చేర్చారు. జగన్ హయాంలో ఆర్డర్లు ఎక్కువగా పొందిన మద్యం కంపెనీల నుంచి ‘లెక్క’ ప్రకారం కమీషన్లను తీసుకుని, ఆ కరెన్సీని అట్ట పెట్టెల్లో తీసుకెళ్లడం.. క్యాష్ హ్యాండ్లర్స్ ద్వారా కొరియర్లకు చేర్చడం.. తర్వాత షెల్ కంపెనీలు, స్థిరాస్తి వ్యాపార ఖాతాల్లో జమ చేయడం.. వారాంతంలో రాజ్ కసిరెడ్డికి లెక్క చెప్పడం.. చైతన్య పని. దిలీప్ రెడ్డి, కిరణ్ అనే మరో ఇద్దరితో కలిపి నగదు రవాణాలో బాధ్యతలు నిర్వహించారు. బేవరేజెస్ నుంచి ముడుపులు అందిన వెంటనే రాజ్ సూచించిన హవాలా ప్రతినిధులకు ముంబై, ఢిల్లీలో నగదు అందజేసేవారని సమాచారం. తర్వాత ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ముడుపులను షెల్ కంపెనీల్లోకి, స్థిరాస్తి వ్యాపారాల్లోకి మళ్లించే ప్రక్రియను పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, సిమ్లను తరచూ మార్చేవారని.. ముడుపులకు సంబంధించిన చర్చలకు వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్లను ఉపయోగించారని ‘సిట్’ గుర్తించింది.
దుబాయ్కి చెక్కేసి...
ఐదేళ్లపాటు వేల కోట్ల మద్యం కమీషన్లు ‘హ్యాండిల్’ చేసిన చాణక్య... రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే దుబాయ్ విమానం ఎక్కేశారు. ‘సిట్’ అధికారులు మద్యం వ్యాపారుల్ని పిలిచి ప్రశ్నించే క్రమంలో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చింది. డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధులతో చాణక్య నిత్యం టచ్లో ఉంటూ... కమీషన్ల డబ్బులు తీసుకెళ్లేవారని నిర్ధారించుకున్నారు. సంబంధిత ఆధారాలు కూడా సేకరించారు. చాణక్య దుబాయ్లో తిష్ఠ వేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచే వీపీఎన్, వీవోఐపీ సర్వీసులతోపాటు వాట్సాప్ ద్వారా ఇక్కడి ‘సహచరుల’తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. తన తోడల్లుడు రాజ్ కసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం, హైదరాబాద్లో సోదాలు, రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారించడం వంటి చర్యలతో... ఎప్పటికైనా తనకూ ఇబ్బంది తప్పదని రెండు రోజుల క్రితం చాణక్య హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలిసింది. కోర్టు ద్వారా రక్షణ పొందేందుకు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతుండగానే... సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చాణక్యను గురువారం విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశముంది.
‘హవాలా’ నెట్వర్క్తో వైసీపీ నేతలకు లింకు..
మద్యం ముడుపుల సొమ్మును హవాలా రూపంలోకి మార్చిన ఆర్గనైజ్డ్ నెట్వర్క్తో కొందరు వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాణక్యను ప్రశ్నించిన సిట్ అధికారులకు ఈ కీలక సమాచారం అందడంతో ఆ దిశగా దర్యాప్తు అడుగులు పడుతున్నాయి. కేసు కొలిక్కి వచ్చే సమయానికి వైసీపీలోని కొందరు కీలక నేతలకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..