Share News

SECI Power Cost: సెకీ విద్యుత్‌ చౌక కాదు

ABN , Publish Date - May 08 , 2025 | 05:49 AM

సెకీతో ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి చౌకగా విద్యుత్‌ రాదని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు తెలిపారు. ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు వర్తించడంవల్ల యూనిట్‌ ధర రూ.4.79కిపైగా ఉంటుందని వెల్లడించారు

SECI Power Cost: సెకీ విద్యుత్‌ చౌక కాదు

  • ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు వెల్లడి

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఏడు వేల మెగావాట్ల ఒప్పందం మేరకు రాష్ట్రానికి చౌకగా విద్యుత్‌ రాదని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు తేల్చి చెప్పారు. ఆ కరెంటు సరఫరాకు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు వర్తిస్తాయని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన సోలార్‌ కరెంటుకు సరఫరా చార్జీలు వర్తించబోవంటూ జగన్‌ పత్రిక రాసిన కథనం పూర్తి నిరాధారమైనదని బుధవారం వెల్లడించారు. అది అవాస్తవాలతో కూడిన కథనం అని కొట్టిపాడేశారు. సెకీ కరెంటుకు సరఫరా చార్జీల మినహాయింపు ఉంటుందంటూ ఇప్పటిదాకా కేంద్ర ఇంధన శాఖ ఉత్తర్వులేవీ జారీ చేయలేదన్నారు.


సెకీ విద్యుత్‌ రాష్ట్రానికి వచ్చే సరికి రూ. 4.79కు పైగానే అవుతుందని పేర్కొన్నారు. సెకీ సౌర విద్యుత్తు రాష్ట్రానికి వచ్చేందుకు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు (ఐఎస్‌టీసీ) పడతాయని చెప్పారు. పీక్‌ సమయం నాలుగు గంటలూ సెకీ నుంచి విద్యుత్తు సరఫరా ఉండదని, అందువల్ల డిమాండ్‌ను తట్టుకునేందుకు బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు రూ. 10కి పైగా పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనివల్ల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు భారీగా పడతాయని చెప్పారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని సెకీతో పోల్చేందుకే లేదన్నారు. యాక్సిస్‌ విద్యుత్తు కొనుగోలు వల్ల పీక్‌ అవర్‌లోనూ విద్యుత్తు సరఫరాకు వీలుంటుందని చెప్పారు.

Updated Date - May 08 , 2025 | 05:49 AM