ACB Court: మద్యం స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:16 AM
మద్యం స్కాం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో మొత్తం 9 మందిని సిట్ అరెస్టు చేయగా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు...
వర్చువల్గా కోర్టులో హాజరు పరిచిన అధికారులు
ఆస్తుల జప్తునకు అనుమతి కోరిన సిట్
విజయవాడ, జూలై 1(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో మొత్తం 9 మందిని సిట్ అరెస్టు చేయగా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు సిట్ కస్టడీలో ఉండడంతో మిగిలిన నిందితులను అధికారులు మంగళవారం వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, చాణక్య, దిలీప్, ధనంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బా లాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్రెడ్డిలకు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. జైలు నుంచే వర్చువల్గా హాజరుపరచడంతో నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంత రం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా వర్చువల్గా హాజరుపరచడం సరికాదన్నారు. దీంతో న్యా యాధికారి భాస్కరరావు వారికి రూల్ బుక్ను చూపించా రు. కొత్త నిబంధనల ప్రకారం నిందితులను వర్చువల్గా హాజరుపరచవచ్చన్నారు. కాగా, వందల మంది అనుచరు లు కోర్టు వద్దకు రావడంతో సిట్ అధికారి ఆర్.శ్రీహరిబాబు అభ్యంతరం తెలిపారు. ‘నిందితులను కలవడానికి కుటుం బ సభ్యులు రావడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. వారితోపాటు వందల మంది కోర్టుకు వస్తున్నారు. నిందితులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. వారికి ఏమైనా జరిగితే సిట్ అధికారులతోపాటు ఎస్కార్ట్ సిబ్బంది ఇబ్బంది పడతారు’ అన్నారు. దీన్ని న్యాయాధికారి సమర్థించారు. సిట్ అధికారుల వాదనలో వాస్తవం ఉంది కదా అని నిందితుల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.
ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వండి..
మద్యం కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సుమారు రూ.30 కోట్ల ఆస్తులను జప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు.