Liquor Scam: ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్
ABN , Publish Date - May 21 , 2025 | 03:17 AM
మద్యం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు జూన్ 3వ తేది వరకు పొడిగించింది. జైల్లో నిందితులు అనుభవిస్తున్న ఇబ్బందులు, బెయిల్ పిటిషన్లపై విచారణ, దర్యాప్తు పురోగతి విషయాల్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఏడుగురు నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు
న్యాయాధికారికి సమస్యల చిట్టా.. ‘నట్స్’ ఇవ్వలేదన్న కృష్ణమోహన్రెడ్డి
ప్రత్యేక బ్యారక్ కావాలన్న గోవిందప్ప.. దిండు, మంచం ఇవ్వాలన్న శ్రీధర్రెడ్డి
జైల్లో జారి పడ్డానన్న ధనుంజయ్రెడ్డి.. కసిరెడ్డి వాంగ్మూలంపై ఈడీ పిటిషన్కు ఓకే
ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్
విజయవాడ, మే 20(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో నిందితులు మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వారి రిమాండ్ను జూన్ 3వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలిచ్చారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య, పైలా దిలీప్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. రిమాండ్ గడువు ముగియడంతో వారిని మంగళవారం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ ఏడుగురు నిందితులు జైల్లో ఇబ్బందులను న్యాయాధికారికి వివరించారు. తనకు నట్స్ ఇవ్వాలని ఆదేశించినా జైలు అధికారులు ఇవ్వడం లేదని జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. తాను ఇచ్చిన ఉత్తర్వులను జైలు అధికారులకు పంపాలని సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయాధికారి ఆదేశించారు. తనకు మంచం, దిండు ఇచ్చినప్పటికీ ప్రత్యేక కేటగిరి బ్యారక్ ఇవ్వలేదని గోవిందప్ప బాలాజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని న్యాయాధికారి చెప్పారు. మంచం, దిండు ఇవ్వాలని సజ్జల శ్రీధర్రెడ్డి కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి సూచించారు. దీనికి ముందు శ్రీధర్రెడ్డి మాట్లాడుతుండగా, ‘యూ ఆర్ వెరీ యాక్టివ్’ అంటూ న్యాయాధికారి వ్యాఖ్యానించారు. జైల్లో పరిశుభ్ర వాతావరణం ఉండట్లేదని, నడుస్తుంటే జారుతోందని, రెండు రోజుల క్రితం తాను కాలు జారి పడిపోయానని మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి తెలిపారు. కాగా, మద్యం కేసులో సిట్ దర్యాప్తును, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఏసీబీ కోర్టుకు తెలియజేయాలని దర్యాప్తు అధికారిని న్యాయాధికారి ఆదేశించారు. సిట్ దాఖలు చేసిన మెమోలో కొత్త విషయాలేమీ లేవన్నారు. ఇప్పటి వరకు నమోదుచేసిన వాంగ్మూలాలను మెమోకు జత చేయాలని, ఇకపైనా ఆ విధంగానే చేయాలని ఆదేశించారు. కోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లు తాము పరిశీలించుకోవడానికి అందుబాటులో ఉండట్లేదని నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయాధికారి స్పందిస్తూ.. దరఖాస్తు చేస్తే కాపీలను అందజేస్తామని చెప్పారు.
రాజ్ బెయిల్ పిటిషన్పై కౌంటర్కు ఆదేశం
మద్యం కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్, గోవిందప్ప బాలాజీని కస్టడీని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. గోవిందప్ప కస్టడీ పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను వారం రోజులు కస్టడీ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. కాగా, మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఈడీ పిటిషన్ను అనుమతిస్తూనే తదుపరి ప్రక్రియ అమలుపై కలెక్టర్కు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News