తులసిబాబు పిటిషన్లో ప్రతివాదిగా చేర్చుకోండి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:42 AM
గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ నిందితుడు కామేపల్లి తులసిబాబు దాఖలు చేసిన పిటిషన్లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్
బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ నిందితుడు కామేపల్లి తులసిబాబు దాఖలు చేసిన పిటిషన్లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తుల వివరాలు వెల్లడి కావాలంటే తలసిబాబు కస్టోడియల్ విచారణ అవసరమని పేర్కొన్నారు. పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, తనను లక్ష్యంగా చేసుకొనే ప్రమాదం ఉందని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ అయిన తనను సీఐడీ పోలీసులు కస్టోడియల్ టార్చర్కు గురిచేశారని రఘురామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడు కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా నిందితుడికి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తులసిబాబు గత శుక్రవారం అత్యవసరంగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం హైకోర్టులో విచారణకు రానుంది.