ఎరువులపై వైసీపీ అసత్య ప్రచారం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:01 PM
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినప్పటికీ వైసీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి ధ్వజం
దర్శి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినప్పటికీ వైసీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం ఓప్రకటన విడుదలచేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎరువుల కొరత లేకుండా సీఎం చంద్రబాబు ముందుగానే కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి అవసరమైన మేరకు యూరియాతో పాటు అన్నిరకాల ఎరువులను తెప్పించినట్టు చెప్పారు. ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు.
దర్శి నియోజకవర్గంలో అన్ని షాపుల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించకుండా వైసీపీ ఆందోళనలు చేపట్టటం శోచనీయమన్నారు. మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మటం లేదన్నారు. గత వైసీపీ హయాంలో రైతుల గురించి పట్టించుకున్న నాథుడు లేడన్నారు. రాజకీయ లబ్ధి కోసం రైతుల మీద కపటప్రేమ చూపుతూ లేని సమస్యను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు.
వైసీపీ నాయకులు ఇదే తీరుగా వ్యవహరిస్తే గణపాఠం చెబుతారని ఆమె స్పష్టం చేశారు. ఎక్కడైనా రైతులకు ఎరువులు అందకపోతే సమస్యను తమ దృష్టికి గాని, అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.