రూ.22కోట్లతో పొదిలి పట్టణాభివృద్ధి
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:09 PM
పొదిలి పట్టణ అభివృద్ధికి రూ.22కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక టింబర్ డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సిద్ధమైన ప్రణాళికలు
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
పొదిలి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : పొదిలి పట్టణ అభివృద్ధికి రూ.22కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక టింబర్ డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు మంజూరైన వెంటనే సీసీ రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలను తీరుస్తామని ఎమ్మెల్యే వివరించారు.అభివృద్ధి పనులను చకచకా సాగేందుకు ప్రజలు, వ్యాపారులు నగరపంచాయతీ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రధానంగా తాగునీటి సమస్య ఉందని దానిని అధిక మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో దర్శి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి 28 గంటలు మాత్రమే పంపింగ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 48గంటలు పంపింగ్ జరుగుతోందన్నారు. అయినా కొంతవరకు నీటి సమస్య ఉందని, ఈనెల 7వ తేదీన జరిగే డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు కోటి సంతకాలంటూ గ్రామాలమీద పడ్డారని ఎద్దేవాచేశారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని తెలిపారు. ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ, ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచినట్లు చెప్పారు. గతంలో నకిలీ మద్యం అంటూ గగ్గోలు పెట్టిన వైసీపీ వారు నకిలీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారన్నారు. దాని నుంచి ప్రజల దృష్టికి మరల్చడానికి కోటి సంతకాలంటూ తిరుగుతున్నారన్నారు. వైసీపీ దుర్మార్గాలు, అరాచకాలు, మాయలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఎమ్మెల్యే కందుల తెలిపారు. సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు డీ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఇమాం సాహెబ్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ముల్లా కుద్దూష్, టీఎన్ఎ్సఎ్ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, టీడీపీ రాష్ట్రకార్యదర్శి గునుపూడి భాస్కర్, క్లస్టర్ ఇన్చార్జి ఆవులూరి యలమంద, నాయకులు సామంతపూడి నాగేశ్వరావు, ఎర్రవం రెడ్డి వెంకటేశ్వరెడ్డి, ఏఎంసీ కార్యదర్శి రవిశంకర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.