Share News

పారదర్శకంగా టీచర్ల బదిలీలు

ABN , Publish Date - May 10 , 2025 | 01:03 AM

త్వరలో ప్రారంభంకానున్న ఉపాధ్యాయుల బదిలీలను చట్ట పరిధిలో పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్డగోలు, అక్రమ బదిలీలకు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ చరిత్రలో ప్రప్రథమంగా ఉపా ఽధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25ను అమల్లోకి తెచ్చింది.

పారదర్శకంగా టీచర్ల బదిలీలు

ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే

ప్రాధాన్యత కేటగిరీల్లో కోత

ఖాళీలపై కసరత్తు

ఒంగోలు విద్య, మే 9 (ఆంధ్రజ్యోతి) : త్వరలో ప్రారంభంకానున్న ఉపాధ్యాయుల బదిలీలను చట్ట పరిధిలో పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్డగోలు, అక్రమ బదిలీలకు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ చరిత్రలో ప్రప్రథమంగా ఉపా ఽధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రతిపాదికనే ప్రస్తుతం టీచర్ల బదిలీలు నిర్వహించనున్నారు. బదిలీ దరఖాస్తు, స్థానాల ఎంపిక, కేటాయింపు ఇలా మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు నిర్వహిస్తారు. విద్యా సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. జూన్‌ 1నుంచి మే 31వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఒక సంవత్సరంలో ఒక పాఠశాలలో 9 నెలల సర్వీసు పూర్తయితే ఒక అకడమిక్‌ ఇయర్‌ సర్వీసుగా లెక్కిస్తారు. కనీసం రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఒకే పాఠశాలలో హెచ్‌ఎంగా ఐదు సంవత్సరాలు, ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఇతర ఉపాధ్యాయులు తప్పని సరిగా బదిలీ కావాల్సిందే.

ప్రాధాన్యత కేటగిరీల్లో కోత

ఉపాధ్యాయుల బదిలీ ల్లో ప్రాధాన్యత కేటగిరీల్లో గతంలో అవకాశం ఇచ్చిన కొన్ని అంశాలను ప్రస్తు తం పక్కన పెట్టారు. గతంలో వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, మాజీ సైనికో ద్యోగులు, సైనికోద్యోగుల స్పౌజ్‌లు, 70శాతంతో శారీరక, ఇతర వైకల్యం ఉన్న వారిని ప్రాధాన్యత కేటగిరీ కింద పరిగణించే వారు. కానీ ఈసారి వీరికి ప్రత్యేక పాయింట్లు మాత్రమే కేటాయిస్తారు. 70శాతంపైన వైకల్యం ఉన్న వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు, వ్యాధిగ్రస్థులైన పిల్లలు ఉన్న వారిని మాత్రమే ప్రాధాన్యత కేటగిరీలో బదిలీ చేస్తారు. స్పౌజ్‌ కేటగిరీ, ఎన్‌సీసీ, స్కౌట్స్‌, జిల్లాస్థాయి గుర్తింపు పొందిన సంఘాల నాయకులకు కూడా బదిలీల్లో పాయింట్లు కేటాయిస్తారు. బదిలీలకు సంబంధించి ఎవ్వరూ కోర్టుకు వెళ్లరాదు. ప్రాధా న్యత కేటగిరీలో బదిలీల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 40శాతం, సబ్జెక్టు టీచర్లు అయితే 50శాతం మాత్రమే ఒక పాఠశాలకు అనుమతిస్తారు. ఒక హైస్కూల్‌లో ప్రతి సబ్జెక్టులో సింగిల్‌ టీచర్‌ పోస్టు ఉంటే దానికి ప్రాధాన్యత కేటగిరీలోని టీచర్లను నియమించరు.

ఖాళీలను గుర్తించేందుకు ఎనిమిది బృందాలు

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రకటించే ఖాళీలను గుర్తించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసింది. వీరు మండలాల వారీ జాబితాలను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్‌ హైస్కూల్‌లో ఈ బృందాలు శుక్రవారం పరిశీలన ప్రారంభించాయి. ప్రతి బృందానికి ఏడు మండలాలు కేటాయించారు. మండల విద్యాధికారులు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన బృందం వద్దకు వెళ్లి పాఠశాలల వారీగా తమ మండలంలోని ఖాళీల వివరాలను వివరించి ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. అనంతరం ఐటీ సెల్‌కు వివరించి వారు కూడా ఆమోదముద్ర తెలిపాక ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలో బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


సీనియారిటీ జాబితాలు సిద్ధం

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు సిద్ధంగా ఉన్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు తెలిపారు. రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో కమిషనర్‌ మాట్లాడారు. ప్రమోషన్లకు ఒక పోస్టుకు ఇద్దరి నుంచి అంగీకారం తీసుకొని ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ప్రమోషన్లు, బదిలీల ద్వారా ఒక పాఠశాలలో 50శాతానికి పైగా టీచర్లు రిలీవ్‌ కావాల్సి వస్తే మెగా డీఎస్సీ సెలక్షన్స్‌ జరిగి కొత్త టీచర్లు వచ్చే వరకు ఆ పాఠశాలలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా పూర్తయినందున దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేస్తామని కమిషనర్‌ చెప్పారు.

Updated Date - May 10 , 2025 | 01:03 AM