పొగాకు రైతుకు భరోసా ఇవ్వాలి
ABN , Publish Date - May 13 , 2025 | 12:04 AM
పొగాకు రైతుల్లో ప్రస్తుతం పంట కొనుగోలు, ధరలపై ఆందోళన ఉందని, వారికి భరోసా ఇవ్వాలని పొగాకు బోర్డుఅధికారులు, కంపెనీల ప్రతినిధులను రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామిలు కోరారు.
ఒంగోలు, మే 12 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుల్లో ప్రస్తుతం పంట కొనుగోలు, ధరలపై ఆందోళన ఉందని, వారికి భరోసా ఇవ్వాలని పొగాకు బోర్డుఅధికారులు, కంపెనీల ప్రతినిధులను రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామిలు కోరారు. దక్షిణాది పొగాకు మార్కెట్ సంక్షోభంలోకి వెళ్తున్న నేపథ్యాన్ని గుర్తించి రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. వేలం కేంద్రాలకు నేరుగా వెళ్లి కొనుగోళ్ల తీరును ప్రత్యక్షంగా పరిశీలించి రైతులు, బయ్యర్లతో మాట్లాడారు. ధరలు దిగజారడం, కొనుగోళ్లు సరిలేకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటిలు చొరవచూపి సోమవారం ఒంగోలులో కీలక సమావేశం నిర్వహించారు. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్, ఈడీ విశ్వశ్రీ, కలెక్టర్ అన్సారియాతో పాటు పొగాకు కొనుగోలు చేసే ప్రధాన కంపెనీల ప్రతినిధులు, వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. రైతులు, వారి తరఫున పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ప్రస్తుత మార్కెట్ తీరు, రైతులకు జరుగుతున్న నష్టం, వారిలో ఉన్న ఆందోళనను సమావేశంలో ఏకరువుపెట్టారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ తాము కూడా వేలం కేంద్రాలు సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించామన్నారు. వ్యాపారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని, రోజువారీ నోబిడ్లు లేకుండా చూడాలని కోరారు. కేవలం మేలు రకం ఒక్కటే కాకుండా అన్నిరకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, అధిక ఉత్పత్తి వంటి కారణాలను బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్ సమావేశం దృష్టికి తీసుకురాగా.. విదేశీ ఆర్డర్లు ఖరారు అయితే మరింత వేగంగా తాము కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వ్యాపార ప్రతినిధులు వివరించారు. విదేశీ ఆర్డర్లు వచ్చేంత వరకు జాప్యం చేయకుండా రైతుల ఆందోళనను అర్థం చేసుకొని పంట కొనుగోలు చేయాలని వ్యాపారులను బోర్డు ఈడీ విశ్వశ్రీ కోరారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు రైతులు ఇబ్బందులు, ఆందోళనను సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.