మూడు కిలోమీటర్లు బాగులేక 30 కి.మీ. దూరం ప్రయాణం
ABN , Publish Date - May 24 , 2025 | 10:38 PM
మండలంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మూరకు గుంత... బారకు ఒక బురద కయ్యలుగా రోడ్లు కనిపిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు మండలంలోని పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్డులు బురద మాగాణిలను తలపిస్తున్నాయి.
ఐదేళ్ల వైసీపీ పాలనలో మూరకూడా
వేయలేని దుస్థితి
గతంలో టీడీపీ హయాంలో
రూ.6కోట్లతో 6 కి.మీ పూర్తి
చాపలమడుగు - చెన్నంపల్లి - దొనకొండ
రోడ్డు పరిస్థితి
ఇబ్బంది పడుతున్న చెన్నంపల్లి గ్రామస్థులు
బాగుచేయాలని కోరుతున్న ప్రజలు
పుల్లలచెరువు, మే 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మూరకు గుంత... బారకు ఒక బురద కయ్యలుగా రోడ్లు కనిపిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు మండలంలోని పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్డులు బురద మాగాణిలను తలపిస్తున్నాయి. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్డుల్లో ప్రయాణం చేయాలంటే వాహనదారులు బెంబేలేత్తుతున్నారు.
చాపలమడుగు - దొనకొండ రోడ్డును పట్టించుకోని వైసీపీ
ప్రధానంగా చాపలమడుగు - చెన్నంపల్లి - దొనకొండకు టీడీపీ ప్రభుత్వ హయంలో భారీగా నిధులు కేటాయించి పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ఆండ్బీ రోడ్డుగా మార్చారు. గత 70 ఏళ్లుగా రోడ్డులేక ఇబ్బందులు పడుతున్నా బాధలను చూసి అప్పటి టీడీపీ ప్రభుత్వం చెన్నంపల్లి కోసం చాపలమడుగు నుంచి చెన్నంపల్లికి 3 కిలో మీటర్లు, త్రిపురాంతకం మండలం మిట్టపాలెం నుంచి చెన్నంపల్లి సమీపంలోని పొలాల వరకు మొత్తం 6 కిలో మీటర్లు పూర్తి చేశారు. మొత్తం 9 కిలో మీటర్ల రోడ్డులో మధ్యలో నిధుల కొరతతో 3 కిలో మీటర్లు నిలిచిపోయింది. దీంతో నిత్యం త్రిపురాంతకం, పుల్లలచెరువు వెళ్లే ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మూడు కిలోమీటర్లు రోడ్డు వేయకపోవడంతో వర్షం పడినప్పుడు బురద మాగాణిని తలపిస్తుంది. దీంతో ఆ దూరం ప్రయాణం చేయలేక వాహనదారులు ఎర్రగొండపాలెం మీదుగా 30 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించి మిగతా రోడ్డును పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.