నీళ్లున్నా.. ఇక్కట్లే!
ABN , Publish Date - May 10 , 2025 | 01:09 AM
మార్కాపురం వాసులకు నీటి కష్టాలు తీరే దారి కనిపించడం లేదు. ప్రస్తుతం వారం, పది రోజులకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొంది. అందుకు సాగర్ పైప్లైన్ పనులు పూర్తి కాకపోవడమే కారణమైంది. రూ.4.7కోట్లతో దూపాడు నుంచి బోడిరెడ్డిపల్లి జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోయాయి.

కాంట్రాక్టర్ల మధ్య జగడం
మార్కాపురం పట్టణ ప్రజలకు శాపం
సాగర్ పైప్లైన్ పనులు పూర్తి చేయని వైనం
దూపాడు-బోడిరెడ్డిపల్లి మధ్య నిలిచిన పనులు
త్వరగా చేయకుంటే తాగునీటికి ఇబ్బందే
మార్కాపురం వాసులకు నీటి కష్టాలు తీరే దారి కనిపించడం లేదు. ప్రస్తుతం వారం, పది రోజులకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొంది. అందుకు సాగర్ పైప్లైన్ పనులు పూర్తి కాకపోవడమే కారణమైంది. రూ.4.7కోట్లతో దూపాడు నుంచి బోడిరెడ్డిపల్లి జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోయాయి. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన బిల్లుల చెల్లింపు వివాదం ప్రజలకు శాపంగా మారింది. పనిని త్వరగా పూర్తి చేయించాల్సిన ప్రజారోగ్య శాఖ అధికారులు చోద్యంచూస్తున్నారు. కనీసం కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు కూడా చొరవ చూపడం లేదు.
మార్కాపురం, మే 9 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణ వాసుల దాహార్తిని తీర్చేది సాగర్ నీటి పథకమే. త్రిపురాంతకం మండలం దూపాడు నుంచి 28 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగితే పురప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత కొన్నేళ్లుగా ఓ కీలకమైన పని పెండింగ్లో ఉండటంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిండా నీళ్లు ఉన్నా సక్రమంగా తాగునీటిని అందించలేని దుస్థితి నెలకొంది. వాస్తవానికి మూడు రోజులకొకసారి పట్టణ ప్రజలకు సాగర్ నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వారం పదిరోజులకొకసారి ఇస్తున్నారు. సాగర్ పైప్లైన్ పనులు పూర్తికాకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల మధ్య బిల్లుల చెల్లింపుల విషయంలో ఏర్పడిన వివాదమే ఇందుకు కారణం.
పైప్లైన్తోనే సమస్య అంతా
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్కాపురం పట్టణానికి సాగర్ నీటిని అందించేందుకు రూ.45కోట్లతో దూపాడు నుంచి మార్కాపురం వరకు పైప్లైన్ నిర్మాణం చేపట్టింది. అప్పట్లో మొత్తం 28 కిలోమీటర్లకుగాను దూపాడు నుంచి బోడిరెడ్డిపల్లె జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా జీఆర్పీ పైప్లైన్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మార్కాపురం వరకు 24.5 కిలో మీటర్ల వరకు డీఐ పైప్లైన్ వేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి సుమారు దశాబ్ద కాలంపాటు ఆ 3.5 కిలోమీటర్ల పరిధిలోనే నెలకు రెండుసార్లైనా లీకులు ఏర్పడేవి. దీంతో మరమ్మతుల ఖర్చులు మునిసిపాలిటీకి తలకుమించిన భారమైంది. ఈనేపథ్యంలో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పాతదాని స్థానే నూతన పైప్లైన్ ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. ఎన్నికలకు ముందు కావడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. తదనంతరం 2022లో వైసీపీ హయాంలో మళ్లీ ఈ పనికి టెండర్లు పిలిచింది. ఏవీఆర్ ఇన్ఫ్రా సంస్థ పనులను దక్కించుకుని వేరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కాంట్రాక్టర్ మాత్రం బిల్లులు పడడం లేదనే కారణంతో మూడేళ్ల కాలంలో ఇప్పటికి రెండు కిలోమీటర్ల మేర మాత్రమే పైప్లైన్ వేశారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా 1.5 కిలోమీటర్ల మేర పని పెండింగ్లో ఉంది.
కాంట్రాక్టర్ల మధ్య బిల్లుల గొడవతోనే జాప్యం
పైప్లైన్ పనులను 2022లో ప్రారంభించిన సబ్ కాంట్రాక్టర్ మొదటి నుంచి నత్తనడకనే సాగించారు. అప్పటివరకు చేసిన 2 కిలోమీటర్ల పనికి 2024 సాధారణ ఎన్నికలకు మూడు మాసాల ముందు రూ.2కోట్ల మేర బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన 1.5 కిలోమీటర్ల మేర పనులు గట్టిగా చేస్తే నెలరోజుల్లోనే పూర్తయ్యేవి. కానీ ఆ దిశగా సబ్ కాంట్రాక్టర్ చొరవ చూపలేదు. ప్రధాన కారణం కాంట్రాక్టర్ ఏవీఆర్ ఇన్ఫ్రా యజమాని అయిన ఓ మాజీ ఎమ్మెల్యే 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు బిల్లులు వాడుకున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పనిచేసింది సబ్ కాంట్రాక్టర్ అయినా బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్ వాడుకోవడంతోనే పనులను నిలిపివేసినట్లు తెలిసింది. వారి మధ్య బిల్లుల లెక్కలు తేలకపోవడంతోనే నేటికీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. వాస్తవానికి సబ్ కాంట్రాక్టర్ ప్రస్తుత ప్రభుత్వ నాయకుడైనా కీలకమైన ఈ పనిని పూర్తి చేయకపోవడంతో ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.